- ఈ ఏడాది 40 శాతం ఎక్కువ రిటర్న్
- ఇచ్చిన ‘బీఎస్ఈ ఐపీఓ’ ఇండెక్స్
- ఐపీఓకి వచ్చేందుకు లైన్లో ఉన్న పేటీఎం, నైకా
- లిస్టింగ్ వైపు చూస్తున్న స్టార్టప్ యూనికార్న్లు..
- స్టాక్ మార్కెట్స్ విస్తరిస్తున్నాయంటున్న ఎనలిస్టులు..
బిజినెస్డెస్క్, వెలుగు: బెంచ్మార్క్ ఇండెక్స్లయిన సెన్సెక్స్, నిఫ్టీలు గత ఏడాదిన్నర నుంచి పెరుగుతూనే ఉన్నాయి. ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. అయినప్పటికీ ఈ ఇండెక్స్లకు మించి ఐపీఓ ఇండెక్స్ పెరిగింది. అంటే గత ఏడాదిన్నర కాలంలో మార్కెట్లో లిస్టింగ్ అయిన కంపెనీలు ఇన్వెస్టర్లకు కళ్లుచెదిరే లాభాలను తెచ్చిపెట్టాయి. గత రెండేళ్లలో లిస్టింగ్ అయిన షేర్లతో ఏర్పడిన ‘బీఎస్ఈ ఐపీఓ’ ఇండెక్స్ ఈ ఏడాది నిఫ్టీ 50 కంటే 40 శాతం ఎక్కువ లాభాలను ఇచ్చింది. 2014 తర్వాత బీఎస్ఈ ఐపీఓ ఇండెక్స్, నిఫ్టీ 50 మధ్య గ్యాప్ ఇంతలా ఉండడం ఇదే మొదటి సారి. మార్కెట్లో లిస్టింగ్ అవుతున్న కంపెనీలు పెరగడం కూడా దీనికి కారణం. 3.2 ట్రిలియన్ డాలర్ల (రూ. 240 లక్షల కోట్లు) విలువున్న మన మార్కెట్ మరింతగా విస్తరించడానికి సిద్ధమవుతోందని నిపుణులు అంటున్నారు. కాగా, గత రెండేళ్లలో మార్కెట్లో లిస్ట్ అయిన షేర్లతో బీఎస్ఈ ఐపీఓ ఇండెక్స్ను తీసుకొచ్చారు. గత కొన్ని నెలల్లో మార్కెట్లో లిస్టింగ్ అయిన షేర్లు భారీ లాభాలను ఇస్తుండడంతో ఈ ఇండెక్స్ కూడా దూసుకుపోతోంది. ఈ ఏడాది మార్కెట్లో లిస్ట్ అయిన మొదటి టెక్ స్టార్టప్ యూనికార్న్ జొమాటో అంచనాలకు మించి పెరగడం (77 శాతం అప్) కూడా బీఎస్ఈ ఐపీఓ ఇండెక్స్ మరింత పెరగడానికి కారణమయ్యింది.
మార్కెట్లోకి రాని కంపెనీలు చాలానే!
మార్కెట్లో లిస్ట్ కాకుండా ఉన్న యూనికార్న్లు చాలా ఉన్నాయి. ఒక బిలియన్ డాలర్ వాల్యుయేషన్ ఉన్న కంపెనీలను యూనికార్న్ అంటారు. రానున్న మూడు నుంచి ఐదేళ్లలో దేశంలోని స్టార్టప్ యూనికార్న్లు డబుల్ అవుతాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ హెడ్ రాజ్ బాలకృష్ణన్ పేర్కొన్నారు. ‘ఈ యూనికార్న్లలో 20–25 శాతం కంపెనీలైనా లిస్టయితే, మార్కెట్ క్యాప్ 500 బిలియన్ డాలర్ల వరకు పెరుగుతుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో ఇంటర్నెట్ వాడే వాళ్లు చాలా ఎక్కువ. టెక్ కంపెనీలపై చైనా తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఇండియాకు మేలు చేస్తున్నాయి. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు దేశీ టెక్ కంపెనీల్లోకి వస్తున్నాయి. టెక్ కంపెనీలతో పాటు, ఇతర ఇండియన్ కంపెనీలు కూడా ఫండ్స్ను సేకరించడానికి పబ్లిక్ ఇష్యూల బాట పడుతున్నాయి. మార్కెట్లు పాజిటివ్గా ఉండడం, ఐపీఓలో కంపెనీలకు వాల్యుయేషన్ ఎక్కువగా వస్తుండడం వీటికి కారణాలు. విదేశాల్లో కాకుండా ఇండియాలోనే కంపెనీలు లిస్టింగ్ అయ్యేందుకు సెబీ రూల్స్ను సులభతరం చేస్తోంది కూడా. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 8.8 బిలియన్ డాలర్లను దేశీయ కంపెనీలు ఐపీఓల ద్వారా సేకరించాయి. పేటీఎం, నైకా వంటి మరిన్ని కంపెనీలు , స్టార్టప్లు ఐపీఓలకు వచ్చేందుకు రెడీగా ఉన్నాయి.
బీఎస్ఈ ఐపీఓ ఇండెక్స్ మంగళవారం 0.77 శాతం నష్టపోయి 12,494.77 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ ఇండెక్స్లోని కొన్ని షేర్లు..
జొమాటో రోసారి మాక్రోటెక్ డెవలపర్స్
బార్బిక్యూ నేషన్ బర్గర్ కింగ్ కెమ్కాన్ స్పెషాలిటీ కెమికల్స్ క్లీన్ సైన్స్ అండ్ టెక్ కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ క్రాఫ్ట్స్మ్యాన్ ఆటోమేషన్ గ్లాండ్ ఫార్మా గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ హ్యాపియెస్ట్ మైండ్స్
ఇండియాలో అవకాశాలు..
యూఎస్, చైనా స్టాక్ మార్కెట్లలో మూడోవంతు షేర్లు టెక్నాలజీ సెక్టార్కు చెందినవే ఉంటాయి. అదే ఇండియన్ మార్కెట్ వాల్యుయేషన్లో టెక్ కంపెనీల వాటా 1 శాతం కంటే తక్కువేనని బాలకృష్ణన్ అన్నారు. టెక్ కంపెనీల గ్రోత్కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నెల సెబీ తీసుకొచ్చిన రూల్స్ వలన విదేశాల్లో కంటే ఇండియాలోనే లిస్టింగ్ అవ్వడానికి ఎక్కువ కంపెనీలు ముందుకొస్తాయని ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండీ గోపాల్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. షేర్హోల్డింగ్ కంట్రోలింగ్పై గ్లోబల్గా అంగీకరిస్తున్న రెగ్యులేషన్స్ను సెబీ తీసుకొస్తోంది. ట్రెడిషనల్గా ఉండే ఫౌండర్ లేదా ప్రమోటర్ రూల్స్ను సవరిస్తోంది. అంతేకాకుండా ఒక కంపెనీ ఐపీఓకి వచ్చాక, కంపెనీ ఫౌండర్లు, ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఇన్వెస్టర్ల లాక్–ఇన్ పీరియడ్ను కూడా మూడేళ్ల నుంచి 18 నెలలకు తగ్గించింది. లాక్–ఇన్ పీరియడ్ అంటే ఫౌండర్లు, ఇన్వెస్టర్లు తమ షేర్లను కొంత టైమ్ వరకు అమ్మకూడదు. సెబీ కొత్త రూల్స్తో చాలా స్టార్టప్ కంపెనీలు, కొత్త తరం కంపెనీలు పబ్లిక్ ఆఫర్స్కు వస్తాయని అగర్వాల్ అభిప్రాయపడ్డారు. వాల్యుయేషన్ ఎక్కువగా ఉన్నా లోకల్గా లిస్టింగ్ అవుతున్న కంపెనీలకు ఆదరణ దక్కుతోందని అన్నారు. చైనా లేదా యూఎస్లోని ఫుడ్డెలివరీ కంపెనీల కంటే, ఇండియాలో జొమాటో లాంటి కంపెనీలకు గ్రోత్ ఎక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.