
- ఫీజుల పేరుతో రూ. 1.25 లక్షలు వసూలు
ఎల్లారెడ్డిపేట, వెలుగు : ముద్ర లోన్ ఇప్పిస్తానని ఫోన్ చేసిన ఓ వ్యక్తి రూ. 1.25 లక్షలు తీసుకొని మోసం చేశాడు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో వెలుగుచూసింది. ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇటీవల ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు.
తాను బ్యాంక్ ఆఫీసర్ను అని పరిచయం చేసుకొని రూ. 5 లక్షల ముద్ర లోన్ ఇప్పిస్తానని చెప్పాడు. నిజమేనని నమ్మిన బాధితుడు లోన్కు ఓకే చెప్పాడు. అయితే వివిధ రకాల ఫీజుల పేరుతో పలు దఫాలుగా రూ. 1.25 లక్షలు పంపాలని కోరడంతో బాధితుడు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశాడు. ఎన్ని రోజులైనా లోన్ రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి ఎల్లారెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గేదెలు అమ్ముతామంటూ..
యాదాద్రి, వెలుగు : గేదెలు అమ్ముతామంటూ ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ చూసిన ఓ వ్యక్తి డబ్బులు పంపి మోసపోయాడు. ఈ ఘటన యాదాద్రి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. భువనగిరి మండలం గౌస్నగర్కు చెందిన భానుప్రసాద్ ఇన్స్టా చూస్తుండగా.. ‘mummy -is my -life- line’ అనే అకౌంట్లో ‘అమ్మకానికి గేదెలు’ అనే ప్రకటన కనిపించింది. దీంతో అక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నంబర్కు ఫోన్ చేసి గేదెలు కావాలని అడగడంతో... ఒక్కొక్కటి రూ. 65 వేలు అని అవతలి వ్యక్తి సమాధానం ఇచ్చాడు.
దీంతో తనకు రెండు గేదెలు కావాలని కోరడంతో మొత్తం రూ. 1.20 లక్షలకు ఒప్పందం కుదిరింది. తర్వాత గుర్తు తెలియని వ్యక్తి సూచన మేరకు భానుప్రసాద్ తన ఆధార్ కార్డుతో పాటు రూ. 1,17,749 పంపించాడు. మిగిలిన అమౌంట్ సైతం పంపితేనే గేదెలు తీసుకొని వస్తానని గుర్తుతెలియని వ్యక్తి చెప్పడంతో అనుమానం వచ్చిన భానుప్రసాద్ 1930కి కాల్ చేశాడు. అనంతరం భువనగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.