
- నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి
మిర్యాలగూడ, వెలుగు: మూడు నెలలకు మించి వలస వెళ్లిన వారితోపాటు, మృతి చెందిన వారి వివరాలు అప్డేట్ చేయకపోవడంతో జిల్లాలో 29 వేల పెన్షన్లు వలస వెళ్లిన, మరణించిన జాబితాలో ఉన్నట్లు గుర్తించామని, వీటిపై విచారించగా సంఖ్య 2 వేలకు వచ్చిందని, ఈ తరహా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని కళాభారతిలో ' చేయూత స్కీం' అమలు తీరుపై ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలతో డివిజన్ స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ ను వినియోగించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, మొక్కల పెంపకంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. వర్షాకాలం సీజన్ పై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అడిషనల్ ఇన్చార్జి కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డీఆర్డీవో శేఖర్ రెడ్డి, రాష్ట్ర సెర్ప్ కార్యాలయ సోషల్ సెక్యూరిటీ పెన్షన్ల పంపిణీ సంచాలకులు గోపాలరావు, ఇన్చార్జి జడ్పీ సీఈవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.