వచ్చే రెండు నెలలు జాగ్రత్త .. కరోనాపై ఆరోగ్య శాఖ ప్రకటన

వచ్చే రెండు నెలలు జాగ్రత్త .. కరోనాపై ఆరోగ్య శాఖ ప్రకటన

దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి కీలక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకూ ఎక్కువగా కరోనా కేసులు నమోదైన కేరళలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే దేశంలో మొత్తం నమోదవుతున్న కేసుల్లో 68శాతం ఈ రాష్ట్రం నుంచే వస్తున్నాయని ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుతం కేరళలో 1.99 లక్షల యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయని.. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, మిజోరాం, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 10వేలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని ప్రకటించింది. ఈ విషయాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ వివరించారు. అదే సమయంలో వచ్చే పండుగల సీజన్‌లో అలర్ట్ గా ఉండాలని ఆయన సూచించారు.

ఈ విషయంలో నీతి ఆయోగ్ సభ్యుడు, జాతీయ కొవిడ్ టాస్క్‌ఫోర్స్ అధినేత డాక్టర్ వీకే పాల్ కూడా స్పందించారు. వచ్చే రెండు, మూడు నెలలు చాలా కీలకమని  చెప్పారు. ఈ సమయంలో కరోనా కేసులు పెరగకుండా చూసుకోవాలని సూచించారు. కరోనా విషయంలో అక్టోబరు, నవంబరు చాలా కీలకమైన సమయమన్నారు. ఈ పండుగల సీజన్‌లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని.. కరోనా కేసులు పెరగకుండా చూసుకోవాలని  వీకే పాల్ అన్నారు.