
- కొత్తలూరులో 30 ఎకరాల్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు
- ఇప్పటికే 16 ఎకరాల భూసేకరణ పూర్తి
- నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 17 వేల ఎకరాల్లో పంట సాగు
నల్గొండ, వెలుగు : ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటులో ముందడుగు పడింది. నల్గొండ జిల్లా అనుమల మండలం కొత్తలూరులో 30 ఎకరాల్లో నిర్మాణం చేపట్టాలని పతంజలి సంస్థ ప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. అప్పటి ప్రభుత్వంతో జరిగిన అగ్రిమెంట్ప్రకారం మూడేండ్ల క్రితమే జిల్లాలో పామ్ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మించాల్సి ఉంది. కానీ భూముల రేట్ల ఎక్కువగా ఉన్నాయనే సాకుతో ఆ సంస్థ ప్రతినిధులు జాప్యం చేశారు.
గతేడాది నల్గొండలో జరిగిన దిశ మీటింగ్లో ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నల్గొండలో ఫ్యాక్టరీ నిర్మించకపోవడంపై ఆ సంస్థ ప్రతినిధులపై సీరియస్అయ్యారు. రెండు నెలల్లో ఫ్యాక్టరీ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని, లేదంటే అగ్రిమెంట్ రద్దు చేస్తామని హెచ్చరించారు. దీంతో దిగొచ్చిన ఆ సంస్థ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.
ఉమ్మడి జిల్లాలో 17 వేల ఎకరాలకు పైగా సాగు..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు సాగవుతున్నాయి. నల్గొండ జిల్లాలో 10 వేల ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 4 వేలు, యాదాద్రి జిల్లాలో 3,500 ఎకరాల్లో ఆయిల్పామ్పంట సాగవుతోంది. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న ఆయిల్పామ్పంటను విజయవాడ సమీపంలోని అంభాపురం ఫ్యాక్టరీకి కంపెనీ నిర్వాహకులు తరలిస్తున్నారు. భవిష్యత్లో ఉత్పత్తులు పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల మధ్య జాతీయ రహదారి వెంట ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది.
ఈ రెండు జిల్లాల మధ్య ఫ్యాక్టరీ ఏర్పాటైతే ఉమ్మడి జిల్లాలోని రైతులతోపాటు సరిహద్దు జిల్లాల వారికి కూడా ఉపయోగపడుతుందని భావించారు. ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా ఆయిల్ పామ్ ఉత్పత్తులను క్రషింగ్ చేయడంతోపాటు రైతులకు అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
కొత్తలూరు గ్రామంలో ఫ్యాక్టరీ..
నల్గొండలోనే 70 శాతం పంట సాగవుతున్న నేపథ్యంలో ఫ్యాక్టరీ ఇక్కడే ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. అనుమల మండలం కొత్తలూరు గ్రామంలో అనువైన రేట్లకు భూమి లభించడంతో ఫ్యాక్టరీ నిర్మాణానికి పూనుకుంది.30 ఎకరాల్లో ఫ్యాక్టరీ నిర్మించనున్నారు. ప్రస్తుతానికి 16 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. సెప్టెంబర్, అక్టోబర్లో భూమిపూజ చేసేందుకు సంస్థ ప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు.
పంట దిగుబడి 5 వేల టన్నులు..
నల్గొండ జిల్లాలో 3 వేలు, సూర్యాపేటలో 2 వేల టన్నుల పంట దిగుబడి వస్తోంది. టార్గెట్ప్రకారం ప్రతి నియోజకవర్గంలో కనీసం 10 వేల ఎకరాలు సాగు చేయాలి. కానీ ఫ్యాక్టరీ లేకపోవడంతో రైతులు ఆసక్తి చూపలేదు.
పైగా ఇక్కడ పండిన పంటను రైతులు సొంత ఖర్చులతో విజయవాడలోని ఫ్యాక్టరీకి తీసుకెళ్లడం భారంగా మారింది. మొక్కలను మట్టితో నింపేందుకు అయ్యే ఖర్చులు కూడా రైతులే భరించాల్సి వచ్చేది. పంటల సాగును ప్రోత్సహించాల్సిన సంస్థ వివిధ రకాల ఖర్చులన్నీ రైతులపై మోపడంతో ఆసక్తి చూపలేకపోయారు.
ఆయిల్ పామ్ తో లాభాలు..
దేశ, విదేశాల్లో ఆయిల్పామ్కు మంచి డిమాండ్ ఉంది. ఒక్క ఎకర వరి సాగుకు ఉపయోగించే నీళ్లతో నాలుగు ఎకరాల ఆయిల్పామ్ సాగు చేయవచ్చు. పైగా డ్రిప్, మొక్కలకు రాయితీ లభిస్తుంది. డిమాండ్ను బట్టి ప్రతినెలా రేట్లను నిర్ణయిస్తుంది. ఇటీవల ఆయిల్పామ్ ఎగుమతి, దిగుమతులపై సుంకాలను కేంద్రం తగ్గించింది. దీంతో టన్ను ధర రూ.1300 పడిపోయింది. ప్రస్తుతం టన్ను ధర రూ.18,778 ఉంది. గత నెలలో రూ.20 వేలు పలికింది. ఫ్యాక్టరీ నిర్మిస్తే రైతులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ఏడాది నల్గొండ జిల్లాలో6,500 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 3 వేల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.