
గద్వాల/ శాంతినగర్, వెలుగు: ఆరు నెలలుగా నిలిచిపోయిన ఇథనాల్ ఫ్యాక్టరీ పనుల్లో కదలిక రావడంతో రాజోలి మండల పరిధిలోని పెద్ద ధన్వాడ గ్రామస్తులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. సోమవారం అర్ధరాత్రి పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం దొంగచాటున కంటైనర్లు, టిప్పర్లు, హిటాచిలను తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపట్టవద్దని నిరాహార దీక్ష చేశామన్నారు.
తహసీల్దార్, ఆర్డీఓ సమక్షంలో అభిప్రాయ సేకరణ జరగ్గా 12 గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపట్టవద్దని తీర్మానించామన్నారు. మరోసారి పనులు ప్రారంభిస్తే అడ్డుకుంటామని రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.