వెలుగు బిజినెస్ డెస్క్: దేశంలోని బ్యాంకులు గడచిన ఫైనాన్షియల్ ఇయర్లో కార్పొరేట్లకు కంటే ఇంటి లోన్లే ఎక్కువగా ఇచ్చాయి. వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ ఇంటి కొనుగోలుపై మోజు తగ్గలేదనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. కార్పొరేట్లు తీసుకునే అప్పులు అనుకున్న దానికంటే నెమ్మదించాయి. మార్చి 2023తో ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్లో కార్పొరేట్ లోన్లు 5.7 శాతం మాత్రమే పెరిగాయి. అంతకు ముందు ఫైనాన్షియల్ ఇయర్లో కార్పొరేట్ లోన్లు 7.5 శాతం పెరగడం గమనించాలి. మరోవైపు 2022–23 లో ఇండ్ల అప్పులు 15 శాతం గ్రోత్ కనబరిచినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డేటా వెల్లడించింది. 2021–22 లో హోమ్ లోన్లు 12.9 శాతమే పెరిగాయి.
కస్టమర్ల కోసం బ్యాంకుల వేట....
కార్పొరేట్ లోన్లు ఆశించినంతగా పెరగకపోవడంతో చాలా బ్యాంకులు ఇండ్ల అప్పులు ఇవ్వడం కోసం కస్టమర్లను వెతకడం మొదలెట్టాయి. ఫలితంగా మార్చి 2023తో ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్లో ఇంక్రిమెంటల్ హౌసింగ్ లోన్లు రూ. 2.5 ట్రిలియన్లకు చేరాయి. గత 15 ఏళ్లలో బహుశా ఇదే అత్యధికమని ఆర్బీఐ డేటా చెబుతోంది. పరిశ్రమలకు 2022–23 లో బ్యాంకులు ఇచ్చిన అప్పులు రూ. 1.8 ట్రిలియన్లకే పరిమితమయ్యాయి. లోన్ రీపేమెంట్లను మినహాయించి ఈ లెక్కలు కట్టారు. 2021–22 లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆ సంవత్సరంలో కార్పొరేట్లు రూ. 2 ట్రిలియన్ల మేరకు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నాయి. అదే ఏడాదిలో ఇంటి లోన్లు రూ. 95,419 కోట్లు మాత్రమే.
ఇంటి లోన్లు తీసుకునే వారి బిహేవియర్ ఒకే విధంగా ఉండటం లేదు. ఒక్కో బ్యాంకులో ఒక్కో రకంగా ఉంటోంది. హోమ్లోన్లకు డిమాండ్ పెద్దగా కనబడటం లేదని కొన్ని బ్యాంకులు చెబుతుంటే, మరికొన్ని బ్యాంకులు మాత్రం ఇంటి కొనుగోలును కొంత మంది వాయిదా వేసుకుంటున్నట్లు చెబుతున్నాయి. కిందటేడాది మే నుంచి రెపో రేటును 250 బేసిస్ పాయింట్ల మేర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పెంచింది. మా ఇంటి లోన్ల పోర్ట్ఫోలియో ఈ ఏడాది మరింత వేగంగా పెరిగే ఛాన్స్ ఉందని కెనరా బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కే సత్యనారాయణ రాజు చెప్పారు. ఇంటి రుణాలు తీసుకునే కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. హోమ్లోన్ల సెక్టార్ కెనరా బ్యాంకుకు చాలా ముఖ్యమైనది, ఈ అవకాశాన్ని వదులుకోవడం మాకు ఇష్టం లేదని రాజు వెల్లడించారు. ఈ బ్యాంకు ఇండ్ల కొనుగోళ్లకు ఇచ్చిన అప్పులు 2022–23 లో 14.3 శాతం పెరిగాయి. ఇంటి లోన్లకు డిమాండ్ తగ్గే సూచనలేవీ లేదని రాజు చెబుతున్నారు. మరోవైపు ఈ బ్యాంకు ఇచ్చిన కార్పొరేట్ లోన్లు కూడా 2022–23 లో 21 శాతం ఎగిశాయి. సెక్వెన్షియల్గా చూస్తే మాత్రం ఇవి కొంత తగ్గాయి.
పెరిగిన పోటీ..
హోమ్లోన్లకు డిమాండ్ ఎక్కువైన నేపథ్యంలో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల మధ్య పోటీ తీవ్రమైంది. యాక్సిస్ బ్యాంక్ హోమ్ లోన్లు 5 శాతం పెరిగాయి. ఈ సెగ్మెంట్లో పోటీ ఎక్కువైందని, ఫలితంగా రేట్లు తగ్గిస్తున్నారని యాక్సిస్ బ్యాంక్ సీఈఓ అమితాబ్ చౌదరి ఎనలిస్టుల మీటింగ్లో చెప్పారు. కొటక్ మహీంద్రా బ్యాంక్ హోమ్లోన్– లోన్ ఎగెనెస్ట్ ప్రాపర్టీ (ల్యాప్) సెగ్మెంట్ 2022–23 లో 22 శాతం ఎక్కువైంది. చివరి క్వార్టర్లో కొంత డిమాండ్ తగ్గింది. మార్చి నెలలోనైతే రేట్ల విషయంలో పోటీ తీవ్రమైందని కొటక్ మహీంద్రా బ్యాంకు హోల్ టైమ్ డైరెక్టర్ శాంతి ఏకాంబరం వెల్లడించారు. ప్రీమియం, లగ్జరీ ఇండ్ల కొనుగోలు మాత్రం డిమాండ్ పుంజుకుంటోందని ఆమె చెప్పారు.
ఎఫర్డబుల్ హౌసింగ్ డిమాండ్ తగ్గుతోంది..
ఇంటి కొనుగోళ్లపై వడ్డీ రేట్ల పెంపుదల ప్రభావం అసలు లేనే లేదని చెప్పడం తప్పవుతుంది. కానీ, ఎఫర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్లో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనబడుతోంది. వడ్డీ రేట్ల పెంపుదల ఈ సెగ్మెంట్లోని కస్టమర్లపై ప్రభావం బాగా చూపెడుతోంది. మిడ్రేంజ్, అప్మార్కెట్ కస్టమర్లపై మాత్రం వడ్డీ రేట్ల పెంపు ఎఫెక్ట్ అంతగా కనిపించడం లేదని బ్యాంకింగ్ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా మిడ్ రేంజ్ హోమ్స్ సెగ్మెంట్ హౌసింగ్ డిమాండ్ను పెంచుతోందని ఇటీవల సీఐఐ–ఎనరాక్ రిపోర్టు పేర్కొంది. డెవలపర్లు కూడా ప్రీమియం సెగ్మెంట్లో కొత్త ప్రాజెక్టులను తక్కువ రేట్లకు లాంఛ్ చేస్తున్నట్లు ఈ రిపోర్టు వివరించింది.