డబ్బు కోసం తల్లిని చంపిండు.. పరారీలో కొడుకు

డబ్బు కోసం తల్లిని చంపిండు.. పరారీలో కొడుకు

భద్రాచలం, వెలుగు: తాగుడుకు బానిసైన కొడుకు డబ్బు కోసం కన్నతల్లినే చంపాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రామచంద్రుని పేటకు చెందిన కల్లూరి పగడమ్మ(75)కు ఇద్దరు కూతుళ్లు, ఆరుగురు కొడుకులు. అందరికీ పెళ్లిళ్లు జరిగి వేర్వేరుగా ఉంటున్నారు. 7వ సంతానమైన నర్సింహారావు తాగుడుకు బానిసై ఇంట్లో గొడవ చేస్తుండటంతో భార్య ఆరు నెలల క్రితం పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి నర్సింహారావు తల్లి పగడమ్మ వద్దనే ఉంటున్నాడు. రోజూ తాగడానికి తల్లిని డబ్బుల కోసం వేధిస్తుండేవాడు. శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో తల్లితో గొడవపడి రోకలిబండతో ముఖంపై కొట్టాడు. దీంతో పగడమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె మెడలోని బంగారం కాసులు తీసుకుని పారిపోయాడు. 6వ కొడుకు వీరాస్వామి ఫిర్యాదు మేరకు ఎస్సై రవికుమార్‍ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.