
- లైసెన్స్ల జారీ విషయంలో నిబంధనలు పాటించాలి: డీజీపీ జితేందర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా 9,294 లైసెన్స్డ్ ఆయుధాలు ఉన్నట్టు డీజీపీ జితేందర్ తెలిపారు. గత మూడేండ్లలో కేవలం 510 లైసెన్స్లు మాత్రమే జారీ చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో జారీ చేసిన ఆయుధ లైసెన్స్లు, లైసెన్స్ల జారీలో నిబంధనల అమలు, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తెలంగాణలోకి ఆయుధాల సరఫరా తదితర అంశాలపై డీజీపీ జితేందర్ శుక్రవారం పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైసెన్స్ల జారీ విషయంలో నిబంధనల మేరకు అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.
లైసెన్స్దారులు సమర్పించిన కారణాలు హేతుబద్ధంగా ఉంటే మాత్రమే లైసెన్స్ కాలపరిమితిని పొడిగించాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే, క్రీడా విభాగంలో షూటర్లు, క్రీడాకారుల కోసం జారీ చేసిన లైసెన్స్లను, వారు ఎటువంటి పోటీల్లో పాల్గొనకపోతే సమీక్షించాలని ఆదేశించారు. లైసెన్స్ పొంది సకాలంలో ఆయుధం కొనుగోలు చేయని వారు, ఆయుధం కొనుగోలు చేసి సంవత్సరాల తరబడి రౌండ్లు ఉపయోగించని వారు, లైసెన్స్లను రెన్యూవల్ చేయని వారు, ఆయుధాలను ఆర్మరీలో సంవత్సరాల తరబడి ఉంచిన వారికి నోటీసులు జారీ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ సూచించారు.
ఇతర ప్రాంతాలకు వెళ్లిన లైసెన్స్దారులు తమ లైసెన్స్లను సంబంధిత జిల్లాలో తిరిగి నమోదు చేయాలని, వారి ఆచూకీ తెలియకపోతే హైదరాబాద్లోని వారి చిరునామాకు నోటీసులు పంపాలని డీజీపీ సూచించారు. ఆయుధ లైసెన్స్ల జారీలో ఆర్మ్స్ (సవరణ) చట్టం, 2019ని కచ్చితంగా పాటించాలని సూచించారు. లైసెన్స్ రెన్యూవల్ సమయంలో సదరు ఆయుధం లైసెన్స్దారుడికి అవసరమా? లేదా? అన్నది జాగ్రత్తగా పరిశీలించాలని ఆయన ఆదేశించారు.
ఒకవేళ లైసెన్స్దారు ఇచ్చిన కారణాలు సంతృప్తికరంగా లేకపోతే, ఆ లైసెన్స్లను రెన్యూవల్ చేయవద్దని స్పష్టం చేశారు. అక్రమ ఆయుధాల కదలికలపై సమాచారం సేకరించాలని, అక్రమ ఆయుధాల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. సమావేశంలో శాంతిభద్రతల అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, రాచకొండ సీపీ జి. సుధీర్ బాబు సహా వివిధ జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.