
హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు ఇంజనీరింగ్/ఇతర కాలేజీల్లో సీట్ల పెంపును తిరస్కరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కాలేజీలు దాఖలు చేసిన అప్పీళ్లను గురువారం హైకోర్టు కొట్టివేసింది. సీట్ల పెంపు, కోర్సుల విలీనానికి కాలేజీలు చేసుకున్న అభ్యర్థనకు ప్రభుత్వ తిరస్కరణ సబబేనంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది.
ఏఐసీటీఈ, జేఎన్టీయూ ఆమోదం మేరకు సీట్ల పెంపు, కోర్సుల విలీనానికి ప్రభుత్వం అనుమతించకుండా వాటి దరఖాస్తులను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఎంజీఆర్, సీఎంఆర్, కెఎంఆర్, మల్లారెడ్డి, మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, మారుతి తదితర పలు కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్లను గత మేలో సింగిల్ జడ్జి కొట్టివేయగా అవి అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టి అప్పీళ్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.