- 8 మందిని కస్టడీకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు
- ఇప్పటికే రూ.23 కోట్లు స్వాధీనం.. మిగతా మొత్తంపై ఆరా
హైదరాబాద్, వెలుగు: తెలుగు అకాడమీ ఎఫ్డీ స్కామ్ కేసులో ఇప్పటికే రూ. 23 కోట్లు స్వాధీనం చేసుకున్న సీసీఎస్ పోలీసులకు.. మిగతా రూ. 41.5 కోట్ల రికవరీ సవాల్గా మారింది. ఫోర్జరీ గ్యాంగ్ యూబీఐ, కెనరా బ్యాంక్ల నుంచి డైవర్ట్ చేసిన ఎఫ్డీ క్యాష్ ఎక్కడుందో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం 8 మంది నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు. సాయికుమార్, చెన్నైకి చెందిన పద్మనాభన్, ఆర్ఎంపీ డాక్టర్ వెంకట్, రాజ్కుమార్, భూపతి రావు, వెంకటరమణ, అకాడమీ డైరెక్టర్ల పీఏ సురభి వినయ్ బాబు, సాంబశివరావులను రెండ్రోజుల కస్టడీకి సోమవారం చంచల్గూడ జైలు నుంచి సీసీఎస్కి తరలించారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్, సంతకాలతో కొట్టేసిన రూ.64.5 కోట్ల ఎఫ్డీలలో ఇప్పటికే రూ.20 కోట్లు విలువ చేసే ప్రాపర్టీస్ని అటాచ్ చేశారు. రూ.3 కోట్ల క్యాష్ రికవర్ చేశారు. మరో రూ.41.5 కోట్ల వివరాలు రాబట్టేందుకు కస్టడీలో విచారిస్తున్నారు. జనవరి నుంచి జూన్ వరకు విడతల వారీగా కొట్టేసిన డబ్బుతో నిందితులు జల్సాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి క్యాష్ స్వాధీనానికి అవకాశం లేదు కాబట్టి ల్యాండ్, ప్రాపర్టీస్ను సీజ్ చేయాలని భావిస్తున్నారు. క్యాష్ రికవరీ కాకుండా నిందితులు వేరే బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్స్లోని అమౌంట్ను ఫ్రీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. రియల్ ఎస్టేట్లో నిందితుల పెట్టుబడులు, ఆస్తుల సీజింగ్ కోసం ఈడీ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.