జయశంకర్భూపాలపల్లి, వెలుగు: రాష్ట్రంలో ఆధార్ ఎనేబుల్డ్పేమెంట్ సిస్టం(ఏఈపీఎస్) సర్వర్ వారం రోజులుగా మొరాయిస్తోంది. దీంతో రాష్ట్రంలోని కస్టమర్ సర్వీస్ పాయింట్లు పనిచేయడం లేదు. నగదు లావాదేవీలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఆసరా పింఛన్దారులకు అందాల్సిన రూ.400 కోట్ల సొమ్ము బ్యాంకు అకౌంట్లలోనే మగ్గిపోతున్నాయి. దీంతో పింఛన్ డబ్బులపైనే ఆధారపడి జీవిస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు. ఇప్పటికే నెల ఆలస్యంగా ప్రభుత్వం వేసిన డబ్బులు వారం దాటుతున్నా చేతికి అందకపోవడంతో చిన్న బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతున్నారు. రాష్ట్రంలో ప్రతి నెల 35.95 లక్షల మంది ఆసరా పింఛన్దారులకు రూ.770 కోట్లు విడుదల చేస్తోంది. ఇందులో 70 శాతం నిధులను కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో నివసించే పెన్షనర్ల బ్యాంకు అకౌంట్లలో నేరుగా వేస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే 30 శాతం మందికి పోస్టాఫీసు ద్వారా పంపిణీ చేస్తున్నారు. జూన్ నెలకు సంబంధించిన పింఛన్ డబ్బులను జులై 5న విడుదల చేయాల్సి ఉండగా జులై చివరి వారంలో ప్రభుత్వం రిలీజ్ చేసింది. పోస్టాఫీసు ద్వారా సుమారు రూ.230 కోట్లను ఆసరా పింఛన్దారులకు జూలై నెలాఖరులోగా పంపిణీ చేశారు. బ్యాంకు అకౌంట్లలో జమ చేసిన రూ.540 కోట్లలో ఏటీఎం కార్డులున్నవారు రూ.140 కోట్ల వరకు డబ్బులు విడిపించుకోగా కస్టమర్ సర్వీస్ పాయింట్లపై ఆధారపడినవారికి సుమారు రూ.400 కోట్లు ఇంకా అందలేదు. ఆగస్టు నెల రెండో వారం వస్తున్నా ఆ డబ్బులు బ్యాంకుల్లోనే మూలుగుతున్నట్లు సీఎస్పీ ప్రొవైడర్స్ చెబుతున్నారు.
ఏఈపీఎస్ సర్వీస్ అంటే..
డిజిటల్ ఇండియాలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ ఎనేబుల్డ్పేమెంట్ సిస్టం(ఏఈపీఎస్) ద్వారా కస్టమర్ సర్వీస్ పాయింట్లు(సీఎస్పీ) ఏర్పాటు చేశారు. వీటినే గ్రామీణ ప్రాంతాల్లో చిన్న బ్యాంకులుగా పిలుస్తున్నారు. ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ప్రతి గ్రామంలో వీటిని నెలకొల్పారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో అయితే 10 నుంచి 20 వరకు ఉన్నాయి. మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో మూడు, నాలుగు చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సీఎస్పీ సెంటర్లో వేలిముద్రలు వేసి వారి బ్యాంకు అకౌంట్లో ఉన్న నగదును రోజుకు రూ.10 వేల వరకు విత్డ్రా చేసుకోవచ్చు. నెలలో ఇలా నాలుగుసార్లు తీసుకోవచ్చు. అలాగే ఆధార్కార్డు ఉన్న మరో వ్యక్తికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దీంతో అసరా పింఛన్లు తీసుకునే లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ప్రతి నెల వారి అకౌంట్లో వేసిన పింఛన్ డబ్బులను ఈ సెంటర్ల వద్దకే వెళ్లి వేలిముద్రలు వేసి తీసుకుంటున్నారు. సీఎస్పీ సెంటర్లలో అత్యధికం ఎస్బీఐ అనుబంధంగా ఏర్పాటు చేసినవే. బ్యాంకు సర్వర్, ఏఈపీఎస్ సర్వర్ వేర్వేరుగా ఉన్నాయి. వారం రోజులుగా ఏఈపీఎస్ సర్వర్(ఎస్బీఐ) మొరాయిస్తుండటంతో కస్టమర్ సర్వీస్ పాయింట్ల వద్ద డబ్బులు తీసుకోలేక ఆసరా పింఛన్దారులు ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకుకు వెళితే రూ. 20 వేలలోపు నగదు బయటనే తీసుకోవాలని వెళ్లగొడుతున్నారు. ఇక్కడేమో సర్వర్ మొరాయిస్తుండటంతో నగదు ఇవ్వలేమని తిప్పి పంపుతున్నారు. దీంతో లక్షలాది మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు నగదు కోసం అటు బ్యాంక్, ఇటు సీఎస్పీ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. జూన్ నెలకు సంబంధించిన పింఛన్ జూలైలో తీసుకోవాల్సి ఉండగా ఆగస్టు మొదటి వారం దాటినా కూడా లబ్ధిదారులు
తీసుకోలేకపోతున్నారు.
20 వేలలోపు నగదు ఇవ్వం: బ్యాంకర్లు
రూ.2 వేలు, రూ.3 వేల నగదును తీసుకోవడానికి ఆసరా పింఛన్దారులు నేరుగా బ్యాంకుకు వెళితే సీఎస్పీ సెంటర్లకు వెళ్లమని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇక్కడ రూ.20 వేలలోపు నగదు ఇవ్వలేమని అంటున్నారు. ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ డబ్బులు ఇస్తే తప్ప నెల గడవని లబ్ధిదారులకు రూ.20 వేల లింకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. లబ్ధిదారులు సీఎస్పీ కేంద్రాలకు వెళ్తే బ్యాంకు ఏఈపీఎస్ సర్వర్ పనిచేయడం లేదు, మేము ఇవ్వలేమంటూ చెబుతున్నారు. సర్వర్ ప్రాబ్లమ్తో లబ్ధిదారులు గత నెల 28వ తేదీ నుంచి నేటి వరకు ఇంకా తిరుగుతూనే ఉన్నారు.
ఈ వృద్ధురాలి పేరు -వజ్రమణి. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు గ్రామం. 86 ఏళ్ల వయసులో కాళ్లు చేతులు సరిగా పనిచేయక మంచాన పడింది. ఆసరా పింఛన్ డబ్బులు రూ.2016 ఈమె బ్యాంకు అకౌంట్లో జమ చేస్తున్నారు. ఈ డబ్బులు తీసుకోవాలంటే ప్రతి నెలా ఈమెకు నరకం కనిపిస్తోంది. కాళ్లు చేతులు సరిగ్గా పనిచేసినప్పుడు ఆమె స్వయంగా వెళ్లి డబ్బులు తీసుకునేది. ఇప్పుడు మంచం పైనుంచి లేవలేకున్నా పిల్లలు ఆటోలో చిన్న బ్యాంకు దగ్గరికి తీసుకపోతే వేలిముద్ర వేసి డబ్బులు తెచ్చుకునేది. కానీ వారం రోజులుగా వేలిముద్ర మెషిన్పనిచేస్తలేదని పింఛన్ డబ్బులు ఇవ్వడం లేదు. ఈ నెల ఇప్పటికే ఆటో కిరాయికి రూ.300 ఖర్చు చేసింది. బ్యాంక్ దగ్గరకు తీసుకుపోతే ఆఫీసర్లు డబ్బులు ఇవ్వకుండా ఆన్లైన్కాడకి తీసుకపోండి అని అంటున్నారు. పెద్ద బ్యాంకులో డబ్బులు ఇయ్యరాయే.. చిన్న బ్యాంక్ లు పని చేయవాయే.. ఏం చేయ్యాల్నో సర్కారోళ్లే చెప్పాలె అని వృద్ధురాలు నిట్టూరుస్తోంది.