- ఒకరి మృతి.. మరో 20 మందికి గాయాలు
ఛత్తీస్ గఢ్: జష్ పూర్ లో లఖీంపూర్ తరహా ఘటన చోటు చేసుకుంది. దసరా వేడుకల్లో పాల్గొన్న భక్తుల మీదుగా కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 20 మందికి పైగా గాయపడ్డారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఇవాళ దుర్గమ్మ విగ్రహాల నిమజ్జనం ఊరేగింపు జరుగుతోంది. భక్తులంతా భక్తి పారవశ్యంతో నిమజ్జన ఊరేగింపులో లీనమై వెళ్తుండగా.. హఠాత్తుగా ఓ కారు భక్తులపై దూసుకెళ్లింది. దీంతో భక్తులు కారు బానెట్ పై నుంచి ఎగిరి చెల్లాచెదురుగా పడ్డారు. 20మందికిపైగా గాయపడగా ఒకరు మృతి చెందారు.
ఘటనతో భక్తులు కోపోద్రికులై కారులోని వ్యక్తులను పట్టుకుని చితకబాదారు. కారును తగులబెట్టేశారు. కారులో గంజాయి తరలిస్తున్నారనే అనుమానంతో పోలీసులు ఆపే ప్రయత్నం చేయగా తప్పించుకునేందుకు వేగంగా నడుపుతూ భక్తులపై దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనకు కారకులైన బబ్లు విశ్వకర్మ, శిశుపాల్ సాహు లను ఛత్తీస్ గఢ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మధ్యప్రదేశ్ కి చెందిన వారీగా గుర్తించారు. కారులో పెద్ద మొత్తంలో దొరికిన గంజాయి దొరికినట్లు సమాచారం.
ఘటనపై స్పందించిన సీఎం
భక్తులపైకి కారు దూసుకెళ్లిన ఘటనపై ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ స్పందించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎలా జరిగిందన్నది ఆరా తీయడంతోపాటు గాయపడిన భక్తులకు మెరుగైన చికిత్స అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.