పాక్​ను విఫల దేశంగా నిలిపిన కార్గిల్​ వార్​

 పాక్​ను విఫల దేశంగా నిలిపిన కార్గిల్​ వార్​

భారతదేశాన్ని 150 ఏళ్లు పాలించిన బ్రిటీషోళ్లు.. పోతూపోతూ పాకిస్తాన్​ ఆధిపత్యాన్ని పెంచేందుకు దేశాన్ని విభజించారు. ఇండియా లేదా పాక్​లో చేరేందుకు రాచరిక రాష్ట్రాల పాలకులకు ప్రత్యేక హక్కులిచ్చారు. దీంతో జమ్మూకాశ్మీర్​ పాలకుడు మహారాజా హరిసింగ్​.. రాష్ట్రాన్ని భారత్​లో కలిపేస్తూ 1947 అక్టోబర్​ 26న విలీనపత్రంపై సంతకం చేశారు. ఆ మర్నాడే నాటి భారత గవర్నర్​ జనరల్​ మౌంట్​బాటెన్​ దానికి ఆమోదం తెలిపారు. తమలో కలుస్తుందని భావించిన పాకిస్థాన్​కు అది కలగానే మిగిలిపోయింది.
నిజానికి భారత్​లో కాశ్మీర్​ కలుస్తోందని ముందే గ్రహించిన పాకిస్థాన్​ కుట్రలకు తెరలేపింది. 1947 అక్టోబర్​ 22న కాశ్మీర్​పై దాడి చేసింది. భారత సైన్యం అక్కడకు చేరుకునే సమయానికి చాలా ప్రాంతాలను ఆక్రమించేసింది. అయితే, పాక్​ సైన్యాన్ని తిప్పికొట్టిన భారత్​.. ఆ దేశం ఆక్రమించిన అనేక ప్రాంతాలను మళ్లీ స్వాధీనం చేసుకుంది. పాక్​ ఆక్రమణల వ్యవహారాన్ని 1948 డిసెంబర్​ 31న నాటి మన ప్రధాని జవహర్​ లాల్​ నెహ్రూ.. ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రపంచం ఒత్తిళ్లతో నెహ్రూ అయోమయంలో చిక్కుకుపోయారు. దాని ఫలితంగా ఇప్పుడు కాశ్మీర్​లోని చాలా భూభాగం ఇప్పుడు ‘పాక్​ ఆక్రమిత కాశ్మీర్​’గా మిగిలిపోయింది. మీర్పూర్​, భీంబర్​, కోట్లి, బాగ్​, ముజఫరాబాద్​, గిల్గిట్​, బాల్టిస్తాన్​ వంటివి ఆ ప్రాంతంలోనే ఉండిపోయాయి.  
పాక్​ భ్రమలు 
పాకిస్థాన్​ కమాండ్​ అండ్​ స్టాఫ్​ కాలేజీలో లెఫ్టినెంట్​ కర్నల్​గా ఉన్నప్పుడు జావేద్​ అబ్బాస్​కు ‘ఇండియా- ఎ స్టడీ ప్రొఫైల్​’ అనే రీసెర్చ్​ ప్రాజెక్ట్​ను ఇచ్చింది ఆ దేశం. మూడేళ్లలో ఆ రీసెర్చ్​ను పూర్తి చేసి 1990లో జావేద్​ పబ్లిష్​ చేశాడు. భారత్​కే సొంత సమస్యలున్నాయని, వాటిని వాడుకుని శక్తిమంతమైన భారత సైన్యాన్ని నియంత్రించవచ్చని తన అధ్యయనంలో పేర్కొన్నాడు. అయితే, 1980 నుంచి మన దేశంపై పాకిస్తాన్​ సైన్యం మనస్తత్వం ఎలా ఉందో ఈ రీసెర్చ్​ తెలియజేసింది. దేశం విడిపోయినప్పటి నుంచి కాశ్మీర్​ను ఆక్రమించడమే పాక్​ తన ఎజెండాగా పెట్టుకుంది. దాని కోసమే కాశ్మీర్​లో ఎప్పుడూ సమస్యలను సృష్టిస్తూనే ఉంది. మార్షల్​ లా సమయంలో పాక్​ అధ్యక్షుడు ఇస్కాందర్​ మీర్జా నుంచి దేశ పగ్గాలను మొదటి ఆర్మీ జనరల్​ అయూబ్​ ఖాన్​ గుంజుకున్నాడు. 

అయితే, భారతీయులను తక్కువ అంచనా వేశాడు. ఇండియన్లు బలహీనంగా ఉన్నారనుకున్నాడు. ధైర్యం తక్కువని, తిరిగి కొట్టే శక్తిలేదని, ఒక్క దెబ్బ కొడితే భారతీయులంతా విచ్ఛిన్నమవుతారని అనుకున్నాడు. అంతర్జాతీయ సరిహద్దుల్లో భారత్​ దాడి చేయదని అయూబ్​ ఖాన్​కు అప్పటి విదేశాంగ మంత్రి జుల్ఫికర్​ అలీ భుట్టో హామీ కూడా ఇచ్చారు. ఆ తప్పుడు అభిప్రాయంతోనే 1965లో భారత్​పైన పాక్​ సైన్యం దాడి చేసింది. అయితే ఊహించని విధంగా 1965 డిసెంబర్​ 3న భారత సైన్యం ఎదురుదాడి చేయడంతో అయూబ్​ఖాన్​ కంగారు పడిపోయాడు. వెంటనే 50 లక్షల కాశ్మీరీల కోసం.. 10 కోట్ల మంది పాకిస్తానీలను ప్రమాదంలో పడేయలేనని తన మంత్రివర్గ సమావేశంలో తేల్చి చెప్పాడు. ఆ నిర్ణయంతో పాక్​సైన్యం వెనుదిరిగింది. 

పాక్​ మరో ఆర్మీ జనరల్​ యాహ్యా ఖాన్​ కూడా అయూబ్​ ఖాన్​లాగానే భారత్​ను దెబ్బతీయొచ్చని కలలు కన్నాడు. పదేళ్ల పాటు నువ్వే దేశాధిపతివంటూ 1971లో కొందరు జ్యోతిష్యులు చెప్పడంతో.. అతడి నమ్మకం మరింత పెరిగిపోయింది. ‘ముస్లిం యోధుల చారిత్రక ఆధిపత్యం ఆధారంగా భారత్​పై యుద్ధం చేస్తాం’ అంటూ విర్రవీగాడు. భారత సైన్యం దాడి గురించి తూర్పు పాకిస్తాన్​ (ఇప్పటి బంగ్లాదేశ్​) చెప్పినప్పుడు.. ఆ దేశం కోసం తాను కేవలం ప్రార్థననే చేయగలనని చెప్పడం యాహ్యా ఖాన్​ అధికార మదానికి అద్దం పడుతుంది. ఆ తర్వాత అతడు కనీసం 10 రోజులు కూడా అధికారంలో ఉండలేకపోయాడు. భారత్​ వైమానిక దాడి గురించి పాకిస్తాన్​ నేవీ చీఫ్​ ద్వారా తెలుసుకుని.. బెంగాలీల కోసం పాకిస్తాన్​ను ప్రమాదంలో పడేయలేనంటూ తోకముడిచాడు.  
అయినా మారని దుర్మార్గపు ఆలోచనలు
రెండు యుద్ధాల్లోనూ పాక్​ ఓడిపోయినా.. దాని దురాలోచనలు మాత్రం మారలేదు. కార్గిల్​ యుద్ధానికి ముందు 1990లో కార్గిల్​ నుంచే భారత్​పై దాడి చేసేందుకు పాక్​ సైన్యం ప్రతిపాదనలు చేసింది. అయితే, ఆ ప్రతిపాదనలను రెండుసార్లు తిరస్కరించారు. మొదటిసారి జియా ఉల్​ హక్​, రెండో సారి బెనజీర్​ భుట్టోలు దాడి వద్దన్నారు. బెనజీర్​ భుట్టో సమయంలో పాక్​ ఆర్మీ అధిపతిగా పర్వేజ్​ ముషారఫ్​ ఉన్నాడు. అయితే, మూడోసారి ఆ ప్రతిపాదనలను తిరస్కరించే వీల్లేకుండా.. లెఫ్టినెంట్​ జనరల్​ మహ్మద్​ అజీజ్​ ఖాన్​, లెఫ్టినెంట్​ జనరల్​ మహ్మద్​ ఖాన్​, మేజర్​ జనరల్​ జావేద్​ హసన్​లతో కలిసి, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తానని అన్నాడు. ఈ యుద్ధంలో లెఫ్టినెంట్​ కల్నల్​ జావేద్​ అబ్బాస్​ కూడా వాళ్లకు కీలకంగా మారాడు.  
ఇండియా ఎదురుదాడి
ఇండియా శక్తి గురించి పాక్​ అంచనా వేయలేకపోయింది. మొదట పాక్​ దాడి చేయడంతో ఏం జరుగుతోందో అర్థంకాక ప్రభుత్వం, సైన్యం షాక్​ తిన్నాయి. వెంటనే అప్రమత్తమై కార్గిల్​లో పాక్​ సైన్యం కుట్రలను సైనికులు తిప్పి కొట్టారు. శక్తిమంతమైన బోఫోర్స్​ తుపాకులతో కొండలపైన ఉన్న పాక్​ సైనికులను మట్టుబెట్టారు. వైమానిక దళాలనూ సైన్యం వాడింది. పాక్​సైన్యాన్ని తరిమేసి ఆ దేశం ఆక్రమించిన కార్గిల్​ కొండలను మళ్లీ వశపరచుకుంది.  1999 జూన్​ 13న టోలోలింగ్​ శిఖరాన్ని పాక్​ చెర నుంచి విడిపించింది. మొత్తం యుద్ధంలో ఇదో గొప్ప విజయం. తర్వాత జూన్​ 20న పాయింట్​ 5140నూ స్వాధీనం చేసుకుని టోలోలింగ్​ మిషన్​ను పూర్తి చేసింది. 1999 జులై 4న టైగర్​ హిల్స్​ను చేజిక్కించుకుంది. ఆ క్రమంలో అన్ని శిఖరాలనూ స్వాధీనం చేసుకుంది. భారత్​ వైమానిక దాడులు చేసినా పాక్​ మాత్రం చేయలేదు. విమానదాడులు చేస్తే తామే దాడికి దిగినట్టు ప్రపంచానికి చెప్పినట్టవుతుందని భావించిన పాక్​.. తాము యుద్ధం చేయడం లేదని, ముజాహిదీన్లు తమ స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారని నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ యుద్ధంలో పాక్​సైనికులు పెద్ద సంఖ్యలో మరణించారు. ఆ దేశ నార్తర్న్​ లైట్​దళం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. ఓ దశలో తన ఓటమిని అంగీకరించిన ముషారఫ్​.. సైనిక చర్యలతోనే కాకుండా, ప్రపంచ దేశాల దౌత్యం ద్వారా కూడా భారత్​ గెలిచిందని వాపోయాడు. ప్రపంచం మొత్తం తమను యుద్ధానికి బాధ్యులుగా చేసిందని నాటి పాక్​ విదేశాంగ కార్యదర్శి శంషాద్​ అహ్మద్​ ఖాన్​ అన్నారు. ప్రపంచం ఒత్తిడి చేయడంతో వెనకడుగు వేశామన్నారు. మాజీ లెఫ్టినెంట్​ జనరల్ అలీ కులీ ఖాన్​.. కార్గిల్​ ఓటమి చరిత్రలోనే పాకిస్తాన్​కు అతిపెద్ద ఓటమిగా ప్రకటించారు. యుద్ధం సమయంలో భారీ సంఖ్యలో పాక్​ ఆర్మీ అధికారులు డ్రగ్స్​కు బానిసలయ్యారు. 
విఫల దేశంగా పాకిస్తాన్​ 
కార్గిల్​ యుద్ధం పాకిస్తాన్​ను ఒక విఫల దేశంగా నిలబెట్టింది. ఆ దేశ నాటి ప్రధాని, ఆర్మీ చీఫ్​లు ఒకరిపై ఒకరు నిందలు మోపుకున్నారు. కార్గిల్​ యుద్ధం గురించి తనకేమీ తెలియదని నవాజ్​ షరీఫ్, అన్నీ తెలుసని ముషారఫ్​ ఆరోపణలు చేసుకున్నారు. నిజంగా ఆ విషయం ప్రధానికి తెలియనట్టయితే.. ‘పాకిస్తాన్​లో సైన్యం లేదు.. సైన్యంలోనే పాకిస్తాన్​ ఉంది’ అన్న విషయాన్ని చెప్తుంది. ఇటు పాకిస్తాన్​ సైన్యంలోనూ భిన్నాభిప్రాయాలు వినిపించాయి. ఆపరేషన్​ కోసం ఇంత భారీగా సైన్యాన్ని సమీకరించడంలో ఉద్దేశమేంటో చెప్పాలంటూ ముషారఫ్​ను అప్పటి అడ్మిరల్​ ఫైసుద్దీన్​ బుఖారీ ప్రశ్నించాడు. చలికాలంలో ఎలాగైనా ఖాళీ చేయాల్సిన బంజరు భూమి కోసం పోరాడాల్సిన అవసరమేముందని నిలదీశారు. సైన్యాన్ని వెనక్కు పిలవాలని మిత్ర దేశం చైనా కూడా చెప్పడంతో పాక్​ మరింత తట్టుకోలేకపోయింది. దీంతో సైన్యాన్ని పాక్​ వెనక్కు పిలిచింది. అప్పుడు దాని కుట్రలు బయటపడ్డాయి. ముజాహిదీన్​ పేరిట కాశ్మీర్​లో పాక్​ బీభత్సం సృష్టిస్తుందన్న విషయాన్ని తేటతెల్లం చేసింది. సైనికులను ఎత్తైన శిఖరాల్లో పాక్​ విడిచిపెట్టేసింది. కనీసం వారికి తిండి కూడా అందించలేదని..చనిపోయిన సైనికుల శవపరీక్షలు వెల్లడించాయి. చాలా మంది సైనికుల కడుపుల్లో గడ్డి ఉన్నట్టు తేలింది. అంటే కనీసం వారికి తిండిని కూడా పాక్​ అందించలేదని బహిర్గతమైంది. పాక్​ ఏర్పాటైనప్పటి నుంచి ఆ దేశంలో జవాబుదారీతనం లేదు. కార్గిల్​ యుద్ధానికి కారణమైన ఆర్మీ చీఫ్​ దేశాధ్యక్షుడయ్యారు. యుద్ధంలో సైన్యాన్ని నడిపించిన ఆర్మీ ఆఫీసర్​కు ప్రమోషన్​ వచ్చింది. 
కార్గిల్​పై కుట్రలు
కార్గిల్​పై దాడిలో భాగంగా భారత్​ ఎదురుదాడి చేయకుండా ఆపాలని భావించిన పాక్​ సైన్యం.. ముందుగా శ్రీనగర్ , లేహ్​ను కలిపే హైవేపై సరుకుల రవాణాను నిలిపేయాలని అనుకుంది. జిహాద్​ కోసం 20 వేల నుంచి 30 వేల మంది దాకా యువకులను పంపించాల్సిందిగా ఆఫ్గనిస్తాన్​లోని తాలిబాన్​ అధిపతి ముల్లా రబ్బానిని అడిగింది. అయితే, 30 వేలు కాదు.. 50 వేల మందిని పంపిస్తానని రబ్బాని హామీ ఇచ్చాడు. 1965, 1971 యుద్ధాల తర్వాత కార్గిల్​పై భారత్​ పట్టుసాధించడంపై ముషారఫ్​ అసహనంతో రగిలిపోయాడు. భద్రతా పరంగా అత్యంత వ్యూహాత్మకమైన ఆ ప్రాంతపు శిఖరాలను చేజిక్కించుకోవాలని కలలుకన్నాడు. యుద్ధమంటూ వస్తే అణుయుద్ధానికి దారితీసే అవకాశాలున్నందున.. మూడో పార్టీ జోక్యం తప్పనిసరి అవుతుందని భావించి కాశ్మీర్​ను అంతర్జాతీయ వివాదంగా మార్చేందుకు పాక్​ ప్రయత్నాలు చేసింది. ఆ తర్వాత ఎల్వోసీని దాటి కార్గిల్​లోని ప్రాంతాలను ఆక్రమించేందుకు కుట్రలు పన్నింది. 

                                                                                                                               - డా.​ టి. ఇంద్రసేనారెడ్డి రసాయన, పర్యావరణ, సామాజిక శాస్త్రవేత్త