ఎల్లుండి నుంచి శ్రీశైలంలో స్పర్శ దర్శనాలు

ఎల్లుండి నుంచి శ్రీశైలంలో స్పర్శ దర్శనాలు
  • కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దశలవారీగా స్పర్శ దర్శనాలు
  • 7 విడుతలుగా అభిషేకాలు, 4 విడుతలుగా సామూహిక అభిషేకాలు, మూడు విడుతలుగా వీఐపీ బ్రేక్ దర్శనాలు
     

శ్రీశైలం: భూ కైలాసగిరి శ్రీశైల మల్లన్న క్షేత్రంలో ఈనెల 18 నుంచి దశల వారీగా స్పర్శ దర్శనాలు కల్పించాలని దేవస్థానం నిర్ణయించింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనాలు కల్పిస్తామని ఆలయ ఈవో కేఎస్ రామారావు ఒక ప్రకటనలో తెలియజేశారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా గర్భాలయ అభిషేకాలను ఏడు విడుతలుగా కల్పించాలని నిర్ణయించారు. అలాగే సామూహిక అభిషేకాలు కూడా నాలుగు విడుతలుగా కల్పించాలని.. అదే విధంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు మూడు విడుతలుగా కల్పించాలని నిర్ణయించారు. 
ఆన్ లైన్ ద్వారా కరెంటు బుకింగ్.. అభిషేకం టికెట్లు బుక్ చేసుకోవచ్చు
శ్రీశైల మల్లన్న క్షేత్రంలో జరిగే సేవలన్నీ ఆన్ లైన్ ద్వారా, కరెంటు బుకింగ్ ద్వారా చేసుకునే సదుపాయం యధావిధిగా కొనసాగుతుందని దేవస్థానం ప్రకటించింది. అలాగే గతంలో మాదిరే అర్జిత కుంకుమార్చన, నవావరణ అర్చన, వృద్ధ మల్లికార్జునస్వామి వారి అర్జిత అభిషేకాలు పరిమిత సంఖ్యలో కొనసాగించాలని నిర్ణయించారు. అలాగే బ్రేక్ దర్శనాలు మూడు విడుతలుగా అంటే ఉదయం 7 గంటలకు తొలి విడుత, మధ్యాహ్నం 12.30 గంటలకు రెండో విడుత, తిరిగి రాత్రి  7.30 గంటలకు మూడో విడుత బ్రేక్ దర్శనాలు అనుమతిస్తారు. బ్రేక దర్శనానికి రూ.500 టికెట్ గా నిర్ణయించారు. అంతేకాదు గతంలో మాదిరే ఈసారి కూడా వేద ఆశీర్వచనం కూడా పునః ప్రారంభిస్తున్నారు. రోజుకు నాలుగు విడుతలుగా వేద ఆశీర్వచనం నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించింది. 
కోవిడ్ నిబంధనలు తప్పనిసరి
శ్రీశైలంలో దర్శనానికి వచ్చే భక్తులు ఆలయంలో.. బయటా కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని దేవస్థానం ప్రకటించింది. మాస్కు ధరించడం, సోషల్ డిస్టెన్స్ మెయిన్ టెయిన్ చేయడం తప్పనిసరి. ఆలయంలోకి అడుగుపెట్టే ముందే శానిటైజ్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. 
సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి
స్వామి అమ్మవారల స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులు, అర్జిత సేవలు జరుపుకునే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి రావాల్సి ఉంటుందని దేవస్థానం స్పష్టం చేసింది. పురుషులు పంచె, కండువాలను, మహిళలు తగిన సంప్రదాయ వస్త్రాలను మాత్రమే ధరించి రావాల్సి ఉంటుందన్నారు. ఆలయ సంప్రదాయాలకు భంగం కలిగించే రీతిలో దుస్తులు ధరించి రావడం పూర్తిగా నిషేధించామని దేవస్థానం తెలియజేసింది. సంప్రదాయ దుస్తుల ధారణలో భక్తులందరూ సహకరించాలని దేవస్థానం కోరింది. స్వామి అమ్మవారల దర్శనానికి వచ్చే భక్తులకు నిరంతరం ఉచిత ప్రసాద వితరణ కొనసాగిస్తామని దేవస్థానం ప్రకటించింది. వేకువ జామున దర్శనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాత్రి స్వామి అమ్మవార్ల ఏకాంత సేవ ముగిసే వరకు భక్తులకు ఉచిత ప్రసాదం అందజేయడం జరుగుతుందని దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు తెలిపారు.