
- మాజీమంత్రి, ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం
- సోషల్ మీడియాలో హద్దులు దాటి పోస్టింగులు
వనపర్తి, వెలుగు: వనపర్తి నియోజకవర్గంలో రాజకీయాలు ఏక్దమ్ వేడెక్కాయి. మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మధ్య ఇటీవలి కాలంలో వైరం తీవ్రస్థాయికి చేరింది. వారి మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. అనుచరులు కూడా హద్దులు దాటి విమర్శలకు దిగుతున్నారు. విమర్శలు హద్దులు దాటడం, సోషల్మీడియాలో అసభ్యకర పోస్టింగులు వైరల్ కావడంతో పోలీసులు జోక్యం చేసుకునేదాకా పోయింది. ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు తప్పుడు కేసులు పెడుతూ తమ కార్యకర్తలను వేధిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా.. ఇందులో తమ జోక్యం ఏమీ లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. నియోజకవర్గంలో గతంలో రాజకీయాలు హుందాగా ఉండేవని.. ఎవరూ హద్దులు దాటలేదని.. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే బాధ కలుగుతుందని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాజీమంత్రి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మెన్నటి ఎన్నికల వరకు బీఆర్ఎస్లోనే ఉన్నారు. 2023 ఎన్నికలకు ముందు మేఘారెడ్డి కాంగ్రెస్లో చేరి వనపర్తి నుంచి టికెట్ సంపాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన నిరంజన్రెడ్డి మీద విజయం సాధించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య విబేధాలు భగ్గుమంటున్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిమిద ఒకరు విరుచుకుపడుతున్నారు. వాళ్ల అనుచరులు కూడా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. దీనికి తోడు సోషల్మీడియా అసభ్యకరంగా పోస్టులు పెడుతుండడంతో వివాదం ముదురుతోంది.
మాజీ మంత్రి నిరంజన్రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లాలో కబ్జాలకు పాల్పడ్డారని, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రెస్ మీట్లో డిమాండు చేశారు. దీంతో బీఆర్ఎష లీడర్లు కూడా ప్రెస్మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు. రెండు పార్టీల నేతల మధ్య ఈ వివాదంపై రచ్చ నడుస్తోంది. ఇంతలో బీఆర్ఎస్కార్యకర్త ఒకరు మూడు రోజుల కింద ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ సోషల్మీడియాలో చేసిన పోస్టు దుమారం రేపింది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో తమ ఎమ్మెల్యేను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారని కాంగ్రెస్నేతలు పోలీసులను ఆశ్రయించారు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారంటూ బీఆర్ఎస్నేతలు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. సోషల్మీడియా వేదికగా అసభ్యకరంగా పోస్టులు పెడుతుండడం, వ్యక్తిగత విమర్శలు చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎక్కడిపడితే అక్కడ తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి రూ.10కోట్లకు పరువు నష్టం దావా వేసేందుకు నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. దీంతో వనపర్తి రాజకీయాలు ఎటూ దారి తీస్తుందోనన్న చర్చ
జరుగుతోంది.