
జనగామ, వెలుగు : సీజనల్ వ్యాధుల నియంత్రణకు పకడ్భందీగా చర్యలు చేపట్టాలని, వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలని, వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించవద్దని సీజనల్ వ్యాధుల నియంత్రణ, పర్యవేక్షణ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, ప్రాజెక్ట్ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఆయన జనగామ శివారు చంపక్ హిల్స్ హాస్పిటల్ను కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, అడిషనల్ కలెక్టర్ పింకేశ్కుమార్తో కలిసి సందర్శించారు. అక్కడి వైద్య సేవలపై ఆరా తీశారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ చాంబర్లో సిబ్బందితో రివ్యూ నిర్వహించి మాట్లాడారు.
సీజనల్ వ్యాధులపై ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. వైద్య, మున్సిపల్, పంచాయతీ, తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతీ గ్రామంలో శానిటేషన్ పక్కాగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ క్రింద ప్రతి ఇంటికీ వెళ్లి స్క్రీనింగ్ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు 40 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, 54,148 మందికి స్క్రీనింగ్ నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో కావూరి మల్లికార్జున్రావు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమణి, ఎంసీహెచ్ సూపరెంటెండెంట్రాజలింగం తదితరులు పాల్గొన్నారు.