12 నెలలకు.. 13 రీఛార్జ్ లు ఎలా చేస్తారు : టెలికాం కంపెనీలను ప్రశ్నించిన ప్రభుత్వం

 12 నెలలకు.. 13 రీఛార్జ్ లు ఎలా చేస్తారు : టెలికాం కంపెనీలను ప్రశ్నించిన ప్రభుత్వం

మనం సాధారణంగా ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే వచ్చే 28 రోజుల వాలిడిటీ పై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. నెల అంటే 30 రోజులు ఉండాలి కానీ, కంపెనీలు 28 రోజులే ఇస్తుండటంతో మనం ఏడాదికి 12 సార్లకు బదులు 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తోంది. దీనిపై రాజ్యసభలో ఎంపీ రాఘవ్ చద్దా ప్రశ్నించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

30 రోజుల ప్లాన్  
టెలికాం కంపెనీలు Jio, Airtel, BSNL, Vi ప్లాన్లలో కనీసం ఒకటైనా పూర్తిగా 30 రోజులు వచ్చేలా చూడాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ నిబంధన ఉన్నా, కంపెనీలు వీటిని పెద్దగా ప్రచారం చేయడం లేదు. ఇకపై ఈ ప్లాన్ల గురించి ప్రజలకు తెలిసేలా చేయాలని ప్రభుత్వం కంపెనీలపై ఒత్తిడి తెస్తోంది.

మిగిలిన డేటా 
మనం రోజుకు 2GB డేటా ప్లాన్ తీసుకుంటే, అందులో 1.5GB మాత్రమే వాడితే మిగిలిన 0.5GB రాత్రి 12 గంటలకు మాయమైపోతుంది. దీనిపై రాఘవ్ చద్దా అభ్యంతరం వ్యక్తం చేశారు. మనం డబ్బులు కట్టి కొన్న డేటా మనకు మిగలాలి.. దాన్ని తరువాత రోజు వాడుకునేలా Data Roll-over అవకాశం ఇవ్వాలి అని ఆయన కోరారు.

ఇన్‌కమింగ్ కాల్స్ 
రీఛార్జ్ అయిపోగానే ఇన్‌కమింగ్ కాల్స్ ఆపేయడం సరికాదని, కనీసం ఏడాది పాటు కాల్స్ వచ్చేలా చూడాలని ఎంపీ సూచించారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 90 రోజుల పాటు ఫోన్ వాడకపోతేనే సిమ్ కార్డును డీయాక్టివేట్ చేయాలి. ప్రస్తుతం ట్రాయ్   ఈ రెండు విషయాలపై అంటే 30 రోజుల వాలిడిటీ ప్లాన్ ఇంకా ఇన్‌కమింగ్ కాల్స్ పై  సీరియస్‌గా దృష్టి సారించింది. త్వరలోనే వినియోగదారులకు లాభం చేకూరేలా కొత్త నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది.