- ముగ్గురు మృతి
- పదిమంది పోలీసులు అరెస్ట్
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ బీజేపీ లీడర్ కుటుంబంపై టెర్రరిస్టులు బుధవారం రాత్రి దాడి చేశారు. బండిపొరా జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు షేక్ వసీమ్ బరీ, అతని తండ్రి బషీర్ అహ్మద్, అన్న ఉమర్ బషీర్ పై కాల్పులు జరపడంతో వాళ్లు అక్కడికక్కడే చనిపోయారని పోలీసులు చెప్పారు. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కాగా.. ఆ కుటుంబానికి ప్రాణ హాని ఉండటంతో 10 మంది పోలీసులతో సెక్యూరిటీ కూడా ఇచ్చార. కాల్పులు జరిగిన సమయంలో పోలీసులు విధుల్లో లేరు. దీంతో ఆ 10 మంది పోలీసులను అరెస్టు చేసినట్లు జమ్మూకాశ్మీర్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ దిల్బాగ్ సింగ్ చెప్పారు. వారికి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారని, వాళ్లంతా ఆ సమయంలో ఇంటి పై ఫ్లోర్లో ఉన్నారని అన్నారు. లష్కరే, హెజ్బుల్ టెర్రర్ గ్రూపులతో సంబంధం ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహించారని అన్నారు. ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న షాప్లో ముగ్గురిపై ఎటాక్ చేశారని, బండిపై వచ్చిన టెర్రరిస్టులు గన్కు సైలెన్సర్ను అమర్చి కాల్పులు జరిపారని అన్నారు. చాలా దగ్గర నుంచి తలలోకి కాల్చడంతో వాళ్లు అక్కడికక్కడే చనిపోయారని డాక్టర్లు చెప్పారు. వసీమ్ మృతిపై ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ హత్యలను ఖండించారు.