- ప్రభుత్వ గ్యారంటీతో టీఎస్ఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో పొందాలని ప్లాన్
- ప్రపోజల్స్ సిద్ధం చేస్తున్న హెల్త్ ఆఫీసర్లు
- నెల రోజుల్లో పూర్తి చేయాలని సూచించిన సీఎం
హైదరాబాద్, వెలుగు: కొత్త మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల ఏర్పాటు కోసం రూ. పది వేల కోట్లు అప్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఆధ్వర్యంలో ఈ అప్పు తెచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం హెల్త్ ఆఫీసర్లు ప్రపోజల్స్ సిద్ధం చేస్తున్నారు. గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశంపై చర్చించినట్టు తెలిసింది.
నెల రోజుల్లోనే ప్రపోజల్స్ సిద్ధం చేసి, కేబినెట్కు సమర్పించాలని హెల్త్ ఆఫీసర్లను సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం. దీంతో ప్రపోజల్స్పై చర్చించేందుకు శుక్రవారం సెక్రటేరియెట్లో ఆఫీసర్లతో హెల్త్ సెక్రటరీ ఓ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను నిర్మించడానికి, ఇప్పటికే ఉన్న దవాఖాన్లలో కనీస వసతుల కల్పనకు, స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తేవడం తదితర అవసరాల కోసం రూ. పది వేల కోట్లు అవసరం అవుతాయని ఆఫీసర్లు అంచనా వేశారు. ఏడాదికి దాదాపు రూ. 3,500 కోట్ల చొప్పున, మూడేండ్లలో ఈ మొత్తం డబ్బులు ఖర్చు పెట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ డెవలప్మెంట్ ప్లాన్ చూపెట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అప్పు కోసం దరఖాస్తు చేసే యోచనలో సర్కార్ ఉన్నట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. ప్రభుత్వ గ్యారంటీతో టీఎస్ఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో అప్పు పొందాలని భావిస్తున్నారు.