
- సమస్యల పరిష్కారంలో ప్రజల భాగస్వామ్యంపై ఫోకస్
- శానిటేషన్, క్లీన్ అండ్ గ్రీన్, సీజనల్ వ్యాధులపై అవగాహన
- సెప్టెంబర్ 10 వరకు కొనసాగనున్న ప్రోగ్రాం
మంచిర్యాల, వెలుగు: ‘ఒక మార్పు.. అభివృద్ధికి మలుపు’ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. ఇందులో భాగంగా మున్సిపల్ ప్రాంతాలను సుస్థిర నివాసయోగ్యమైన, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా మార్చడంపై ఫోకస్ పెట్టారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ప్రారంభమైన ఈ కార్యక్రమం సెప్టెంబర్ 10 వరకు కొనసాగనుంది. శానిటేషన్ మెరుగుపర్చడం, క్లీన్ అండ్ గ్రీన్పై పబ్లిసిటీ, పార్కుల డెవలప్మెంట్, శిథిలావస్థలో ఉన్న బిల్డింగుల తొలగింపు, సీజనల్ వ్యాధుల నివారణ, మెడికల్ క్యాంపులు, బ్లడ్ డొనేషన్ క్యాంపుల నిర్వహణ ఇలా రోజుకో ప్రోగ్రాంను అమలు చేస్తున్నారు. దీనికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు.
సమస్యల పరిష్కారమే ధ్యేయంగా..
మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వారి భాగస్వామ్యంతోనే పరిష్కరించడం ఈ ప్రోగ్రాం ఉద్దేశం. సిటిజన్ చార్టర్ట్ను మరింత మెరుగ్గా అమలు చేయడం, పాలనలో ప్రజల భాగస్వామ్యం పెంచడం, మున్సిపాలిటీల ఇన్కమ్ పెంచడం, క్లీన్ అండ్ గ్రీన్, పర్యావరణ పరిరక్షణ ప్రధానమైన అంశాలుగా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ను రెడీ చేసింది. జూన్ 2న యాక్షన్ ప్లాన్ ఆవిష్కరించి అప్పటినుంచి మున్సిపాలిటీలో రోజుకో కార్యక్రమం చేపడుతున్నారు. వివిధ అంశాలపై ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంపొందించడం కోసం స్థానికుల భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నారు.
చేపడుతున్న పనులు ఇవే..
కాల్వల్లో పూడికతీత, స్వచ్ఛత, పట్టణ పారి శుధ్యంపై ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. కాలర్ ట్యూన్స్, క్యూఆర్ కోడ్స్, సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ చేస్తున్నారు. పట్టణ అభివృద్ధి, సుస్థిర ప్రజారోగ్యం కోసం వివిధ సంస్థలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, బర్తన్ బ్యాంకు (వేడుకలకు ఉపయోగపడే పాత్రలు) ఏర్పాటు, చెత్త సేకరణ భారాన్ని తగ్గించేందుకు ఇంటి వద్దే తడి, పొడి చెత్తలను వేరుచేసి కంపోస్ట్ ఎరువుల తయారీకి ప్రోత్సాహం, సామూహిక మరుగుదొడ్ల పరిశీలనతో పాటు మెరుగైన నిర్వహణకు చర్యలు చేపడుతున్నారు. అలాగే రోడ్ల వెంట ఉన్న చెట్లు, పొదలు, చెత్త తొలగింపు, సీజనల్ వ్యాధులపై అవగాహన, దోమల నివారణ చర్యలు, డంపింగ్ యార్డుల సందర్శన వంటి కార్యక్రమాలపై ఫోకస్ పెడుతున్నారు.
నేడు బ్లడ్ డొనేషన్ క్యాంప్
100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో మంగళవారం మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించనున్నారు. కార్పొరేషన్ ఆఫీస్ ఆవరణలో ఉదయం 10.30 గంటలకు క్యాంపు ప్రారంభించనున్నారు. అలాగే మెప్మా మెంబర్స్ తయారుచేసిన వివిధ రకాల వస్తువులు, పిండి వంటలు అమ్ముకునేందుకు ఏర్పాట్లు చేసినట్టు కమిషనర్ టి.శివాజీ తెలిపారు.
ప్రజల సహకారంతోనే సక్సెస్
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని సమస్యల పరిష్కారం, అందులో ప్రజలను భాగస్వామ్యం చేయడం కోసం ప్రభుత్వం చేపట్టిన 100 డేస్ యాక్షన్ ప్లాన్ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నాం. పారిశుధ్య కార్యక్రమాలు, వనమహోత్సవం, ఇంకుడు గుంతల నిర్మాణంపై అవగాహన కల్పిస్తున్నాం. ఈ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ సిబ్బంది ప్రతిరోజూ ఎంపిక చేసిన ఏరియాల్లో పర్యటించి పలు అంశాలపై స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఇంటింటి సర్వే నిర్వహించి ఇంటి నంబర్లు లేని వారికి నంబర్లు జారీ చేస్తాం. చిరువ్యాపారులను గుర్తించి వారికి లైసెన్స్ జారీ చేయడంతో పాటు కాలనీల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయడానికి ప్రజలు సహకరించాలి.
- తౌటం శివాజీ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్