దేశ వ్యాప్తంగా 7 వేల ప్రాజెక్టులు
అన్ని గ్రామాలకు ఇంటర్నెట్
డిజిటల్ ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత -ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రోడ్డు, రవాణా, కరెంటు వంటి కనీస సదుపాయాలు పెంచడానికి పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. మరింత డెవలప్ మెంట్ కోసం నేషనల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ప్రాజెక్టును ప్రారంభిస్తామని వెల్లడించారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ఢిల్లీ ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.100 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని, ఏడు వేల ప్రాజెక్టులు చేపడతామని ప్రకటించారు. ‘‘భారతదేశాన్ని మరింత త్వరగా ఆధునీకరించడానికి మనకు కొత్త మార్గాలు కావాలి. నేషనల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ప్రాజెక్టు ద్వారా ఇది సాధ్యమవుతుంది. దీనికింద అమలు చేయాల్సిన ప్రాజెక్టులను కూడా గుర్తించాం . కనీస వసతుల ఏర్పాటుకు ఉన్న అడ్డంకులను తొలగిస్తున్నాం. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ రకరకాల రవాణా మార్గాలను నిర్మించడానికి పెద్ద ప్లాన్ ను సిద్ధంగా ఉంచాం. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు ద్వారా అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో పెద్ద ఎత్తున రోడ్లను నిర్మించారు’’ అని మోడీ వివరించారు.
ఇక నుంచి మేక్ ఫర్ వరల్డ్
ఆత్మనిర్భర్ కార్యక్రమం వల్ల మనదేశం ఫైనాన్షియల్ గా మరింత బలపడుతుందని ప్రధాని అన్నారు. సప్లై చెయిన్ ఆపరేషన్ల కోసం చాలా దేశాలు మనవైపు చూస్తున్నాయని, ఇప్పుడు మనం మేకిన్ ఇండియా తోపాటు మేక్ ఫర్ వరల్డ్పైనా ఫోకస్ చేయాలని అన్నారు. ‘‘అన్ని దేశాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టంను బలోపేతం చేయడానికి మనవంతు కృషి చేయాలి. ఇందుకు మనం స్వయంసమృద్ధి సాధించాలి. స్పేస్ టెక్నాలజీ, వ్యవసాయం, ఆరోగ్య, టూరిజం రంగాల్లో ఇండియా ఇంకా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయి. భారతదేశం ఎదిగితే మనతోపాటు ఇతర దేశాలకూ మేలు జరుగుతుంది’’ అని అన్నారు. అన్ని వస్తువులూ మనదేశంలోనే తయారు కావాలని, విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించాలని చెప్పారు. ప్రజలంతా లోకల్ తయారీ వస్తువులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని, విదేశాలకు ముడి పదార్థాలు పంపించి ‘ఫినిష్డ్ గూడ్స్’ను తెప్పించుకునే పద్ధతిని మానేయాలని సూచించారు.
మోడీ ఇంకా ఏమన్నారంటే..
రాబోయే మూడేళ్లలో అన్ని గ్రామాలకూ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తాం. సైబర్ సెక్యూరిటీ పాలసీని కూడా తెస్తాం. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య గుర్తింపుకార్డు లను అందజేస్తాం. అందులో పౌరుల ఆరోగ్య సమాచారం అంతా ఉంటుంది. సరిహద్దు ప్రాంతాల్లో కనీస వసతుల ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపడతాం. నేషనల్ ఇన్ ఫ్రా ప్రా జెక్టులో వీటిని చేర్చుతాం . కరోనా ఇబ్బంది పెడుతున్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాం. గత ఏడాది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు 18 శాతం పెరిగాయి.బ్యాంకింగ్ సెక్టార్లో మార్పులు తేవడం ద్వారా ప్రతి ఒక్కరికీ బ్యాంకు సేవలు అందేలా చేశాం. పేదల కోసం జన్ ధన్ ఖాతాలు అందజేశాం. బీమా సదుపాయం కల్పించాం. డిజిటల్ ట్రాన్సాక్షన్లను ఎంకరేజ్ చేస్తున్నాం. ఇందుకోసం భీమ్ యాప్ను తీసుకొచ్చాం. కేవలం గత నెలలోనే ఈ యాప్ ద్వారా మూడు లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో డిజిటల్ ఎడ్యుకేషన్ ను భాగం చేశాం. వలస కార్మికుల కోసం కొత్తగా హౌజింగ్ ప్రాజెక్టులు చేపట్టాం. కరోనా వచ్చిన మొదట్లో మాస్కులకు, వెంటిలేటర్లకు విపరీతంగా కొరత ఉండేది. ఇప్పుడు వాటిని మనమే తయారు చేసుకుంటున్నాం. విదేశాలకూ ఎగుమతి చేసుకుంటున్నాం. నాణ్యమైన వస్తు వులకు మనదేశం అడ్డా కావాలి. మన వస్తువులను మనం గౌరవించాలి.