తన ఇంటి దగ్గరే ఓటేసిన 103 ఏండ్ల వృద్ధుడు

తన ఇంటి దగ్గరే ఓటేసిన 103 ఏండ్ల వృద్ధుడు

న్యూఢిల్లీ: ఈ నెల 10న జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బెలగావి జిల్లాలోని చిక్కోడికి చెందిన103 ఏండ్ల ఓటరు మహాదేవ మహాలింగ మాలి ఇటీవల ఇంటి నుంచే ఓటు వేశారు. ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి రహస్యంగా ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా చీఫ్​ ఎలక్షన్​ కమిషనర్ రాజీవ్ కుమార్ మంగళవారం ఆ ఓటరుతో ఫోన్‌‌లో మాట్లాడారు. ఇంటి ఓటింగ్ సదుపాయాన్ని వినియోగించుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.​

అలాగే, యువకులు, పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లు ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనడానికి మీలాంటి వృద్ధ ఓటర్లు ప్రేరణగా నిలుస్తారని సీఈసీ అన్నారు. ఈ సందర్భంగా మహాదేవ మాట్లాడుతూ.. తనకు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం కల్పించినందుకు సీఈసీకి కృతజ్ఞతలు తెలిపారు. గత ఎన్నికల్లో వీల్‌‌చైర్‌‌లో వెళ్లి ఓటు వేశానని గుర్తు చేశారు. కరోనా వ్యాప్తి చెందినప్పటి నుంచి ఎన్నికల సంఘం.. 80 ఏండ్లకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఓటర్లకు ఇంటి నుంచే ఓటేసే వీలు కల్పించింది.