ఆర్సీబీ సంబురాల్లో తొక్కిసలాట 11 మంది మృతి..బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర ఘటన

ఆర్సీబీ సంబురాల్లో తొక్కిసలాట 11 మంది మృతి..బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర ఘటన
  • 50 మందికి గాయాలు.. మృతుల్లో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు
  • స్టేడియంలో ప్లేయర్లకు సన్మాన కార్యక్రమం
  • 35 వేల కెపాసిటీ ఉంటే.. 3 లక్షల మంది రాక
  • 3వ నంబర్ గేటు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం
  • ఒకరిపై ఒకరు పడిపోవడంతో తొక్కిసలాట
  • క్షమాపణలు చెప్పిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
  • న్యాయ విచారణకు ఆదేశించిన సీఎం సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ సంబరాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. వేల మంది అభిమానులు గేటు బద్దలు కొట్టి స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగింది. మృతుల్లో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఘటనలో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిని దగ్గర్లోని హాస్పిటల్స్​కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 18 ఏండ్ల తర్వాత ఆర్సీబీ జట్టు మంగళవారం రాత్రి ఐపీఎల్ విజేతగా నిలిచింది. దీంతో ప్లేయర్లందరికీ బుధవారం చిన్న స్వామి స్టేడియంలో కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్​సీఏ) సన్మానం ఏర్పాటు చేసింది. దీన్ని చూసేందుకు లక్షల మంది స్టేడియం వద్దకు తరలి వచ్చారు. సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు.

 
సెక్యూరిటీ గార్డులు స్టేడియం గేట్ నంబర్ 3కు తాళాలు వేయడంతో అభిమానులంతా కలిసి వాటిని బద్దలు కొట్టారు. గేటుపై ఉన్నవాళ్లంతా ఒకరిపై ఒకరు కిందపడిపోయారు. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు అందరూ పరుగులు పెట్టారు. ఫలితంగా తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో గాయపడిన వారిలో పలువురి హెల్త్ కండీషన్ సీరియస్​గా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌..  బౌరింగ్ హాస్పిటల్​కు వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

అసలేం జరిగింది?

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్​గా విజేతగా నిలిచింది. బుధవారం ఉదయం అహ్మదాబాద్ నుంచి జట్టు సభ్యులంతా బెంగళూరుకు చేరుకున్నారు. వీరికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బొకేలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లి సీఎం సిద్ధరామయ్యను కలిశారు. సభ్యులందరినీ ఆయన సన్మానించారు. 

అసెంబ్లీ నుంచి చిన్న స్వామి స్టేడియం వరకు విక్టరీ పరేడ్​ నిర్వహించాలని తొలుత భావించారు. కానీ.. భద్రతా కారణాల రీత్యా విక్టరీ పరేడ్​ను రద్దు చేసుకున్నారు. అసెంబ్లీ నుంచి ఆర్సీబీ జట్టు చిన్న స్వామి స్టేడియంకు బయల్దేరింది. బస్సు వెంట వేలాది అభిమానులు పరుగులు తీశారు. జట్టు సభ్యులంతా స్టేడియం లోపలికి వెళ్లిపోయారు. అప్పటికే స్టేడియం మొత్తం నిండిపోయి ఉంది. ఇంకా వేలాది మంది అభిమానులు బయటే ఉన్నారు. 3వ నంబర్ గేటును బద్దలు కొట్టి లోపలికి వెళ్లే క్రమంలో తొక్కిసలాట జరిగింది. తీవ్రంగా గాయపడిన వారిని బౌరింగ్ హాస్పిటల్, విట్టల్ మాల్యా రోడ్లోని వైదేహి 
ఆస్పత్రికి తరలించారు.

స్టేడియం ముందు హాహాకారాలు

తొక్కిసలాట ఘటనతో స్టేడియం ముందు భయానక వాతావరణం ఏర్పడింది. అభిమానులంతా చెల్లాచెదురు అయ్యారు. తొక్కిసలాటలో ఊపిరాడక కొందరు, గాయపడి మరి కొందరు ప్రాణాలు విడిచారు. చిన్న స్వామి స్టేడియం ముందు ఆర్తనాదాలు, హాహాకారాలు చేశారు. స్పృహ తప్పి పడిపోయిన వారికి పోలీసులు సీపీఆర్ చేశారు. క్రౌడ్​లో తప్పిపోయిన తమవాళ్ల కోసం చాలా మంది వెతికారు. 

స్టేడియం గేటు ముందు చెప్పులు చెల్లాచెదురుగా పడిపోయాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే స్టేడియంకు అభిమానులు పోటెత్తారని పోలీసులు తెలిపారు. కాగా, మృతుల ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించింది. గాయపడినవారందరూ కోలుకునే దాకా ఫ్రీగా ట్రీట్​మెంట్ ఇచ్చేందుకు నిర్ణయిచింది. 

లాఠీచార్జ్ చేయలేదు: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్

అభిమానులపై లాఠీచార్జ్ చేయలేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. క్రౌడ్​ను కంట్రోల్ చేయలేకపోవడంతో క్షమాపణలు చెప్పారు. ‘‘స్టేడియం చుట్టూ 5వేల మంది పోలీసుల మోహరించాం. ప్రజలంతా సంయమనం పాటించాలి. మేము ఊహించినదానికంటే చాలా మంది వచ్చారు. లక్షల్లో అభిమానులు తరలివచ్చారు. 10 నిమిషాల్లోనే ప్రోగ్రామ్​ను ముగించేశాం. పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. మృతుల కుటుంబాలకు సతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను’’అని డీకే శివకుమార్ అన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: బీజేపీ

చిన్న స్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీజేపీ ఆరోపించింది. ప్రజలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సరైన ప్రణాళిక లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని మండిపడింది. అందుకే ఈ ఘోరం జరిగిందని, దీనికి కాంగ్రెస్‌‌ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. ప్లానింగ్ సరిగా లేకపోవడంతోనే తొక్కిసలాట జరిగిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. పబ్లిసిటీపై పెట్టినంత శ్రద్ధ.. పబ్లిక్ సేఫ్టీపై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టదని కర్నాటక బీజేపీ చీఫ్ విజయేంద్ర యెడియూరప్ప విమర్శించారు. 11 మంది మరణాలు రాష్ట్ర ప్రభుత్వ హత్యలు అని బీజేపీ నేత సీటీ రవి ఆరోపించారు. జనాన్ని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆ పార్టీ నేత అమిత్ మాల్వియ మండిపడ్డారు.

విషాదం గురించి స్టేడియం లోపల ఉన్న అధికారులకు తెల్వదు:
ఐపీఎల్ చైర్మన్ ధుమాల్

ఆర్‌‌సీబీ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ధ చోటుచేసుకున్న విషాదంపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు. ఘటన జరిగిన సమయంలో స్టేడియం బయట ఏమి జరుగుతుందో లోపల ఉన్న అధికారులకు తెలియదని పేర్కొన్నారు. విషయం మాకు తెలియగానే యాజమాన్యంతో మాట్లాడామని, వేడుకలను వెంటనే ముగించాలని సూచించామని, వారు కూడా వేడుకను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇది ఘటన చాలా విచారకరం, విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ప్రొటోకాల్ గురించి ప్రస్తావిస్తూ.. బీసీసీఐ, ఐపీఎల్ వేడుకలు మంగళవారం రాత్రే ముగిశాయని ఆయన పేర్కొన్నారు. దీనిని  ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది సంబంధిత ఫ్రాంచైజీపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

నిర్వాహకులు మంచిగా ప్లాన్ చేసి ఉండాల్సింది:
 బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా

బెంగళూరు ఘటన చాలా దురదృష్టకరమని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా అన్నారు. నిర్వాహకులు మంచిగా ప్లాన్ చేసి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంత గొప్ప విజయోత్సవ వేడుకలను నిర్వహించేటప్పుడు సరైన జాగ్రత్తలు, భద్రతా చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనలో ఎక్కడో కొన్ని లోపాలు ఉన్నాయని అన్నారు.  మంగళవారం అహ్మదాబాద్‌‌లో స్టేడియంలో 1,20,000 మంది ఉన్నారని.. కానీ, బీసీసీఐ మంచి టీం వర్క్​తో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేడుకలు ముగించిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

తొక్కిసలాట ఘటన దురదృష్టకరం : ప్రధాని మోదీ

తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. తొక్కిసలాట జరగడం అత్యంత దురదృష్టకరమని తెలిపారు. తమవాళ్లను కోల్పోయిన అందరికీ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. గాయపడినవాళ్లంతా త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు వివరించారు.

ఏడాదిలో 6 తొక్కిసలాటలు

  • జులై, 2024: ఉత్తరప్రదేశ్​లోని హథ్రాస్​లో తొక్కిసలాట జరిగింది. భోలేబాబా అలియాస్ నారాయణ్ సర్కార్ నిర్వహించిన సత్సంగ్​లో ఈ ఘటన చోటు చేసుకున్నది. 121 మంది చనిపోయారు.
  • డిసెంబర్, 2024: హైదరాబాద్​లోని సంధ్యా థియేటర్​లో డిసెంబర్ 4న పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 35 ఏండ్ల మహిళ చనిపోగా.. ఆమె 9 ఏండ్ల కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు.
  • జనవరి, 2025: ఏపీలోని తిరుపతిలో జనవరి 8న విష్ణు నివాసంలో వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల పంపిణీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు.
  • మే, 2025: నార్త్ గోవా షిర్​గావ్​లోని లైరాయ్ దేవి జాతరలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా.. 50 మందికిపైగా గాయపడ్డారు. 
  • జనవరి, 2025: యూపీలోని ప్రయాగ్​రాజ్​లో నిర్వహించిన మహా కుంభ మేళాలో జనవరి 29న తొక్కిసలాట జరిగింది. అమృత్ స్నాన్ సందర్భంగా జరిగిన ఈ ఘటనలో 30 మంది చనిపోయారు. 60 మంది వరకు గాయపడ్డారు.
  • ఫిబ్రవరి, 2025: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్​లో ఫిబ్రవరి 15న తొక్కిసలాట జరిగింది. ప్రయాగ్​రాజ్ కు వెళ్లేందుకు ట్రైన్ ఎక్కే టైమ్​లో ఈ ఘటన చోటు చేసుకున్నది. 18 మంది చనిపోయారు. మృతుల్లో 11 మంది మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు.
  • జూన్, 2025: కర్నాటక బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. ఆర్సీబీ జట్టు ఐపీఎల్ కప్ గెలవడంతో సభ్యులను సన్మానించేందుకు కార్యక్రమం ఏర్పాటు చేయగా ఈ తొక్కిసలాట చోటు చేసుకున్నది.