ఇరాన్లో ఉండొద్దు.. తిరిగొచ్చేయండి.. సేఫ్ జోన్లోకి 110 మంది ఇండియన్ స్టూడెంట్స్

ఇరాన్లో ఉండొద్దు.. తిరిగొచ్చేయండి.. సేఫ్ జోన్లోకి 110 మంది ఇండియన్ స్టూడెంట్స్

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఎప్పుడు ఏ మిస్సైల్ వచ్చి మీద పడుతుందోనని ప్రజలు వణికిపోతున్నారు. ఇరాన్లోని టెహ్రాన్‌‌‌‌లో పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరాన్లోని భారత విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ విషయాన్ని అక్కడి ఎంబసీ అధికారులు వెల్లడించారు. ఇరాన్‌‌‌‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నందున భారత పౌరుల భద్రతను అక్కడి ఎంబసీ నిరంతరం పర్యవేక్షిస్తున్నదని భారత విదేశాంగ శాఖ ఇప్పటికే వెల్లడించింది. 

భారత విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నదని, కొంతమంది విద్యార్థులను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించిందని పేర్కొన్నది. పరిస్థితి మరింత తీవ్రంగా మారితే విద్యార్థులను భారత్‌‌‌‌కు తరలిస్తామని తెలిపింది. ఈ విషయమై ఇప్పటికే ఇరాన్‌‌‌‌ అధికారులతో సంప్రదింపులు జరపగా భూసరిహద్దుల మీదుగా తీసుకెళ్లవచ్చని ఇరాన్​ చెప్పినట్లు ఎంఈఏ వెల్లడించింది. ఇండియా ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది.

టెహ్రాన్లో ఉంటున్న భారతీయులు అక్కడి నుంచి తక్షణమే వెళ్లిపోవాలని, భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని భారత్ సూచించింది. టెహ్రాన్లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఇప్పటికే ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లను +989010144557, 989128109115, +989128109109 అందుబాటులో ఉంచింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కెనడాలో జరుగుతున్న జీ7 సదస్సు నుంచి అర్ధాంతరంగా వైదొలిగి తిరిగి అమెరికా వెళుతుండటంతో ఇరాన్లో ఏదో పెద్దగానే జరగబోతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అంతేకాదు.. టెహ్రాన్ను ఉన్నపళంగా వదిలి వెళ్లిపోవాలని ట్రంప్ చేసిన కీలక సూచన కూడా ఈ అనుమానాలను మరింత బలపడేలా చేసింది. ట్రంప్ చేసిన సూచన తర్వాత భారత్ కూడా టెహ్రాన్లో ఉన్న భారతీయులను అప్రమత్తం చేసింది. టెహ్రాన్ నుంచి వచ్చేయాలని అక్కడ ఉన్న భారతీయులకు సూచించింది. 110 మంది విద్యార్థులను ఇరాన్ నుంచి అర్మేనియాకు భారత ప్రభుత్వం ఇప్పటికే సురక్షితంగా తరలించింది. అర్మేనియా నుంచి ఢిల్లీకి బుధవారం ఆ 110 మంది చేరుకుంటారు.

►ALSO READ | ఎయిరిండియా విమాన బాధితులకు భారత సంతతి డాక్టర్ రూ.6 కోట్ల ఆర్థిక సహయం