- ఆ బంగారం విలువ రూ.3,122.8 కోట్లు
- 2015 నుంచి ఈ ఏడాది ఆగస్టు దాకా 16,555 కేసులు
- 8,401 మందిని అరెస్ట్ చేసిన అధికారులు
- టాప్టెన్ ఎయిర్పోర్టుల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ది తొమ్మిదో స్థానం
న్యూఢిల్లీ: ఇస్త్రీ పెట్టెల్లో పెట్టుకొచ్చి పట్టుబడిపోయారు. కడ్డీల్లో దాచుకొచ్చి దొరికిపోయారు. లగేజీ బ్యాగుల తీగల్లో చెక్కి చిక్కిపోయారు… ఒకటా రెండా.. ఇలాంటి గోల్డ్ స్మగ్లింగ్ గుట్టును ఈ మధ్య మన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులు ఎట్ల రట్టు చేశారో చూశాం. అధికారుల కన్నుగప్పి బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చే ప్రయత్నం చేసి స్మగ్లర్లు విఫలమయ్యారు. మన ఎయిర్పోర్ట్ ఒక్కటే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఎయిర్పోర్టుల నుంచీ బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఆ ముఠాలు అడ్డంగా దొరికాయి. మరి, దేశవ్యాప్తంగా ఈ ఐదేళ్లలో అన్ని ఎయిర్పోర్టుల్లో అధికారులు సీజ్ చేసిన బంగారం ఎంతో తెలుసా..? అక్షరాల పదకొండు వేల కిలోలు. మరి దాని విలువెంత.. రూ.3,122.8 కోట్లు. 2015 నుంచి ఈ ఏడాది ఆగస్టు నాటికి ఐదేళ్లలో 16,555 గోల్డ్ స్మగ్లింగ్ కేసులు నమోదైతే.. ఆ కేసుల్లో సీజ్ చేసిన బంగారమే ఇదంతా. మొత్తం 8,401 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన లెక్కలివి.
దేశానికి అక్రమంగా బంగారాన్ని తరలించేందుకు కేరళ ఎయిర్పోర్టులనే ఎంచుకుంటున్నారు స్మగ్లర్లు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులు ఎక్కువగా నమోదైన, ఎక్కువ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న టాప్టెన్ ఎయిర్పోర్టుల్లో ఆ రాష్ట్రానివే మూడున్నాయి. ఈ జాబితాలో మన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఫస్ట్ ప్లేస్లో ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇక, 2015 నుంచి 2020 వరకు ఐదేళ్లలో 2018లోనే గోల్డ్ స్మగ్లింగ్ ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. ఆ ఏడాదిలోనే ఎక్కువ గోల్డ్నూ అధికారులు సీజ్ చేశారు. అయితే, స్వాధీనం చేసుకున్న బంగారం విలువ మాత్రం 2019లో ఎక్కువగా ఉంది. ఆ ఏడాది సీజ్ చేసిన గోల్డ్ అంతకుముందు ఏడాదితో పోలిస్తే తక్కువే అయినా.. 2019 గోల్డ్ రేటు ప్రకారం అక్రమంగా తీసుకొచ్చిన ఆ గోల్డ్ విలువ ఎక్కువ. అదే ఏడాది ఎక్కువ మందిని అధికారులు అరెస్ట్ చేశారు. ఆ ఏడాది 2,339 మందిని కటకటాల్లోకి నెట్టారు. 2015–16లో 1,408 మందిని, 2016–17లో 788 మంది, 2017–18లో 1,525, 2018–19లో 2,141, 2020–2021లో ఇప్పటిదాకా 200 మందిని కస్టమ్స్ ఆఫీసర్లు అరెస్ట్ చేశారు.
గోల్డ్ ఎక్కువ దొరికిన టాప్ టెన్ ఎయిర్ పోర్టులివే
- ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ముంబై
- ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, న్యూఢిల్లీ
- అన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, చెన్నై
- కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కేరళ
- కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కేరళ
- కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బెంగళూరు
- నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కోల్కతా
- తిరుచురాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, తమిళనాడు
- రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ (శంషాబాద్)
- త్రివేండ్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కేరళ