న్యూఢిల్లీ: ఇండోనేషియాకు చెందిన ఓ సైబర్ నేరగాళ్ల ముఠా ఇండియాలోని ప్రభుత్వ వెబ్సైట్లను టార్గెట్ చేయడానికి సిద్ధపడిందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు 12 వేల వెబ్సైట్లను ఈ ముఠా లక్ష్యంగా చేసుకుందని, వీటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సైట్లు కూడా ఉన్నట్లు తెలిపింది.
‘డేనియల్ ఆఫ్ సర్వీస్, డిస్ట్రిబ్యూటెడ్ డేనియల్ ఆఫ్ సర్వీస్ దాడుల ద్వారా హ్యాకర్లు వెబ్సైట్లను తమ అధీనంలోకి తీసుకునే అవకాశం ఉందన్నారు. పలు వ్యక్తిగత కంప్యూటర్ల ద్వారా ఒకేసారి పెద్ద మొత్తంలో డేటాను వెబ్సైట్లలోకి పంపించి సైబర్ దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని వెల్లడించారు. హ్యాకర్లు టార్గెట్ చేసుకున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ల జాబితాను సైబర్ ముఠా రిలీజ్ చేసిందని కేంద్రం పేర్కొంది.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా హ్యాకర్ల బెడద ఎక్కువైంది. రోజురోజుకు సైబర్ నేరగాళ్ల బారిన పడి సామాన్యులు మోసపోతున్నారు. ఇప్పుడు ఏకంగా ఇండోనేషియా నుంచే 12 వేల వెబ్ సైట్లను టార్గెట్ చేయటం కలకలం రేపుతోంది. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్ట్రాతోపాటు మొబైల్ కు వచ్చే లింక్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు.