
- ఉమ్మడి నల్గొండ జిల్లా నర్సరీల్లో పంపిణీకి మొక్కలు సిద్ధం
- శాఖల వారీగా టార్గెట్
నల్గొండ, యాదాద్రి, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో అడవుల శాతాన్ని పెంచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వన మహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది 1.48 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించారు. శాఖలవారీగా టార్గెట్ నిర్ణయించారు. ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో డీఆర్డీఏ, అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ నెలాఖరున లేదా జులైలో మొక్కలు నాటలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. వన మహోత్సవాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్లు దిశానిర్దేశం చేస్తున్నారు.
నల్గొండ జిల్లాలో..
ప్రభుత్వ లక్ష్యం మేరకు ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని అధికారులు భావిస్తున్నారు. గ్రామాల్లోని వన నర్సరీల్లో పెరిగిన మొక్కలను ఆయా పల్లెల్లోనే నాటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో 844 నర్సరీలు ఉండగా ఈసారి 68,70,800 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 39,51,700, వ్యవసాయ శాఖ ద్వారా 7,66,000, ఉద్యాన శాఖ ద్వారా 6,38,000, మున్సిపాలిటీల ద్వారా 8,20,000 మొక్కలు నాటేందుకు శాఖల వారీగా టార్గెట్ ఇచ్చారు.
సూర్యాపేట జిల్లాలో..
ఈ ఏడాది వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో 59 లక్షల మొక్కలు నాటనున్నారు. ఇందుకోసం అటవీశాఖ ఆధ్యర్యంలో 5, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 475 నర్సరీలను ఇప్పటికే ఏర్పాటు చేసి, 40.47 లక్షల మొక్కలు పెంచుతున్నారు. వీటిని నాటేందుకు ఫారెస్ట్, డీఆర్డీఏ, ఆర్అండ్ బీ, పంచాయతీరాజ్, వ్యవసాయ, నీటి పారుదల, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, విద్య తదితర శాఖలకు బాధ్యతలు అప్పగించారు.
యాదాద్రి జిల్లాలో..
జిల్లాలో 451 నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. ఈ ఏడాది 20,53,100 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 10.39 లక్షలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ఆధ్వర్యంలో 72 వేలు, వ్యవసాయ శాఖ ద్వారా 32 వేలు, హార్టికల్చర్శాఖ ద్వారా 63 వేలు, పంచాయతీరాజ్శాఖ ఆధ్వర్యంలో 2 లక్షలు, ఇరిగేషన్ శాఖ ద్వారా 22 వేలు, ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో 15 వేలు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ద్వారా 54.5 వేలు, ఇండస్ట్రీస్ఆధ్వర్యంలో 25 వేలు, రెవెన్యూ శాఖ ద్వారా19.6 వేలు, అన్ని మున్సిపాలిటీలు కలిసి 4.94 లక్షలు నాటేలా టార్గెట్
నిర్ణయించారు.
ప్రతీ ఇంటికి మొక్కల పంపిణీ
వన మహోత్సవంలో భాగంగా ప్రతీ ఇంటికి మొక్కలు పంచనున్నారు. ప్రజల ఇష్టం మేరకే వారికి నచ్చిన మొక్కలు అందజేయాలని భావిస్తున్నారు. గులాబీ, మందార, గన్నేరు, సీతాఫలం, జామ, ఉసిరి, అల్లనేరేడు, మునగ, గానుగ, తులసితోపాటు ఈత, ఔషధ మొక్కలు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, స్థలాలు, అటవీ ప్రాంతాలు, రహదారులకు ఇరువైపులా, పొలం, చెరువు గట్లు, పరిశ్రమలు, కమ్యూనిటీ సెంటర్లు, హాస్పిటల్స్, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల ఆవరణల్లో విస్తృతంగా మొక్కలు నాటనున్నారు. ఇందుకోసం జిల్లాలోని ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువజన సంఘాల సహకారం తీసుకోనున్నారు.
త్వరలో నాటేందుకు చర్యలు
త్వరలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే వివిధ శాఖలకు టార్గెట్ఇచ్చాం. మొక్కలు నాటడాన్ని ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. ప్రభుత్వమే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు, కళాశాలల ఆధ్వర్యంలో విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలి. అటవీ శాతం పెరిగితేనే పర్యావరణాన్ని పరిరక్షించే అవకాశం ఉంటుంది. జిల్లా అంతటా ఒకేరోజు పెద్ద ఎత్తున ఎక్కువ మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.
ఇలా త్రిపాఠి, కలెక్టర్, నల్గొండ