
భద్రాచలం, వెలుగు : చత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా పోలీసుల ఎదుట మంగళవారం 18 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారి వివరాలను ఎస్పీ కిరణ్ చౌహాన్, సీఆర్పీఎఫ్ కమాండ్ ఆఫీసర్లు సురేశ్ సింగ్ పాయల్, పురుషోత్తంకుమార్, అనురాగ్ రాజ్, సుక్మా ఏఎస్పీ అభిషేక్ వర్మలు వెల్లడించారు. సరెండర్ అయిన వారిలో పీఎల్జీఏ ప్లాటూన్ నంబర్ 2 మెంబర్ మడకం ఐత, పీఎల్జీఏ ప్లాటూన్ నంబర్ 1 మెంబర్ భాస్కర్ అలియాస్ భోగం లక్క, సౌత్ బస్తర్ డివిజన్ టేలర్ టీం కమాండర్ మడకం కల్ము, సౌత్ సబ్ జోనల్ బ్యూరో సప్లై టీం మెంబర్ లక్ష్మణ్, హేమ్లా మంగ్లూ, కుంజం భీమ, మడకం బీమా, ముచకీ మంగా, కొర్సా సంతోష్, తెల్లం మాడ, వెట్టి బండి, సోయం హింగా, మడవి మున్నా, మడవి గంగా, పదం సుక్లూ, దోడి మంగ్లూ, మామిడి మార్క, హేమంత్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరిపై రూ. 8 లక్షల చొప్పున రివార్డు ఉందన్నారు. లొంగిపోయిన వారికి రూ. 50 వేల ప్రోత్సాహకం అందజేశారు.
ఒడిశాలో మరొకరు...
చత్తీస్గఢ్కు చెందిన మావోయిస్ట్ కీలక నేత మంగళవారం ఒడిశా పోలీసుల ఎదుట లొంగిపోయారు. గుమ్సార్ డివిజన్ ఏరియా కమిటీ కార్యదర్శి పూనెం బిజయ్ అలియాస్ అజయ్ రాయగఢ్ ఎస్పీ ఎదుట లొంగిపోయారు. బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్స్టేషన్ పరిధిలోని బట్టిగూడెం గ్రామానికి చెందిన బిజయ్ మావోయిస్ట్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు.
మావోయిస్టుల లేఖలో ఉన్నవన్నీ కల్పితాలే...
దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి వికల్ప్ పేరిట రిలీజ్ అయిన లెటర్లో ఉన్నవన్నీ కల్పితాలేనని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వేలాది మంది అమాయక ఆదివాసీల మరణానికి, ఐఈడీల పేలుళ్లతో భద్రతా సిబ్బంది చనిపోవడానికి బసవరాజు బాధ్యత వహించారన్నారు. అలాంటి ఘటనలకు పాల్పడిన వ్యక్తిని ఎలా కీర్తిస్తున్నారంటూ ప్రశ్నించారు. నంబాల కేశవరావు మరణం తర్వాత పార్టీ షాక్లో ఉందన్నారు. ఆ పార్టీ ఊహించిన దాని కంటే బలమైన విపత్తునే ఎదుర్కొనబోతోందని హెచ్చరించారు.