
అమెరికాకు 22 వేల మంది ఇండియన్ల అప్లికేషన్
అమెరికాలో ఆశ్రయం కోసం అప్లై చేసుకుంటున్న ఇండియన్లు పెరుగుతున్నారు. 2014 నుంచి ఇప్పటివరకు సుమారు 22 వేల మంది ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నట్టు అక్కడి అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీళ్లలో 7 వేల మంది మహిళలున్నారని తెలిసింది. యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ నేషనల్ రికార్డ్స్ సెంటర్ నుంచి ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఈ వివరాలను నార్త్ అమెరికా పంజాబీ అసోసియేషన్ (ఎన్ఏపీఏ) సేకరించింది. ఇండియాలో నిరుద్యోగం, అసహనం పెరగడమే దీనికి కారణమని ఎన్ఏపీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నాం సింగ్ చహల్ అన్నారు.
వేరే దారి లేక అమెరికాకు అక్రమ మార్గంలో వచ్చే వాళ్లు ఇక్కడ ఆశ్రయం పొందడం మరింత కష్టమైన పని అంటున్నారు. అసైలమ్ కోసం ప్రైవేట్గా అటార్నీలను ఆశ్రయిస్తారని, వాళ్లు చాలా ఎక్కువగా ఫీజు తీసుకుంటారని చెప్పారు. అటార్నీలు దొరికినా ఆశ్రయం పొందే ప్రాసెస్ చాలా కష్టమని, వర్క్ పర్మిట్ కోసం ఇక్కడ నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని వివరించారు. కాబట్టి లీగల్గానే అమెరికాకు రావాలని కోరుతున్నారు. మెక్సికో నుంచి అక్రమంగా అమెరికాకు వెళ్దామనుకున్న 311 మందిని ఈ నెల తొలివారంలో మెక్సికో ఇండియాకు తిరిగి పంపింది. ట్రంప్ అధికారంలోకి వచ్చే నాటికి (2017) 5.42 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2019 సెప్టెంబర్ నాటికి ఈ సంఖ్య 10 లక్షలకు చేరింది.