వనపర్తి జిల్లాలో ప్రాథమిక విద్యపై నిర్లక్ష్యం .. 91 స్కూళ్లలో ఒక్కరే టీచరు

వనపర్తి జిల్లాలో ప్రాథమిక విద్యపై నిర్లక్ష్యం .. 91 స్కూళ్లలో ఒక్కరే టీచరు
  • అక్రమ డిప్యుటేషన్లపై ఆందోళన 
  • ఎన్​రోల్​మెంట్​పై ప్రభావం
  • 25 స్కూళ్లలో ఒక్క స్టూడెంట్​కూడా లేరు

వనపర్తి, వెలుగు:  వనపర్తి జిల్లాలో ప్రైమరీ ఎడ్యుకేషన్​ నిర్లక్ష్యానికి గురవుతోంది. అధికారులు, టీచర్లు   ఇష్టారీతిన వ్యవహరించడం  ఈ ఏడాది ఎన్​రోల్​మెంట్​మీద తీవ్ర ప్రభావం చూపింది.  ఇతర జిల్లాల్లో  మూతపడిన స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతుండగా ఈ జిల్లాలో మాత్రం కొత్త అడ్మిషన్ల పరిస్థితి దారుణంగా ఉంది. జిల్లాలో ఈ ఏడాది కూడా 25 ప్రైమరీ స్కూళ్లలో ఒక్క స్టూడెంట్​ కూడా లేరు. జిల్లాలో మొత్తం 91 స్కూళ్లు సింగిల్​ టీచర్​తో నడుస్తున్నాయి. ఈ పరిస్థితికి  అడ్డగోలుగా సాగుతున్న  డిప్యుటేషన్లే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. 

 వనపర్తి జిల్లాలో మొత్తం 518 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో  330 వరకు ప్రైమరీ స్కూళ్లు ఉన్నాయి.  పిలల్లకు భవిష్యత్తుకు పునాది అయిన ప్రైమరీ స్కూళ్లలో చాలావరకు సింగిల్​ టీచర్లతో నెట్టుకొస్తున్నాయి. కొన్ని   స్కూళ్లలో  విద్యార్థుల సంఖ్య మరీ దారుణంగా ఉంది.  అసలు స్టూడెంట్లు లేని, తక్కువ మంది పిల్లల్లున్న స్కూళ్ల నుంచి  టీచర్లను ఇతర ప్రాంతాలకు   డిప్యుటేషన్​పై పంపడంతో  అసలు పిల్లల్లే లేని   స్కూళ్లలో  ఎన్​రోల్ మెంట్​పై దృష్టి పెట్టేవారే లేకుండా పోయారు.   జిల్లాలోని  91 ప్రైమరీ స్కూళ్లలో ఒక్క టీచర్​ మాత్రమే ఉన్నారు. ఈ 91 స్కూళ్లలో 25 చోట్ల స్టూడెంట్లే లేకపోగా..  అయిదుగురు, అంతకన్నా తక్కువ మంది ఉన్న  స్కూళ్లు 17 ఉన్నాయి.     

 డిప్యుటేషన్ల వివాదం  

 జిల్లా విద్యాశాఖలో డిప్యూటేషన్ల రగడ నడుస్తోంది. కొందరు టీచర్లు అనారోగ్యం తదితర కారణాలతో ఆర్​జేడీ ద్వారా  డిప్యూటేషన్​ వేయించుకుంటున్నారు. దీన్ని ఆసరా చేసుకుని చాలామంది టీచర్లు  యూనియన్ల లీడర్లు, రాజకీయ నేతల  ద్వారా పైరవీలు చేయించుకుని తమకు అనుకూలమైన ప్రాంతాలకు  డిప్యుటేషన్లు వేయించుకుంటున్నారు. తాజాగా వీపనగండ్ల మండలంలోని హై స్కూలులో ఇద్దరు టీచర్ల  డిప్యుటేషన్ పై  పేరెంట్స్ ఆందోళనకు దిగారు. ఉన్న టీచర్లను ఇతర ప్రాంతాలకు పంపితే  తమ పిల్లల చదువులు ఏం కావాలని  ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ  డిప్యుటేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేశాయి.

  ఒకే స్కూల్​లో ఇద్దరు సబ్జెక్ట్​ టీచర్లున్నా ఎవరూ మరో స్కూళుకు వెళ్లేందుకు ఇష్టపడకపోవడం.. తాము ఉన్న చోటే కొనసాగేలా  పైరవీలు చేసుకోవడం చర్చనీయాంశమైంది.  జిల్లాకు చెందిన  ఓ ప్రజాప్రతినిధి  అనుచరుడు ఆర్ జేడీ స్థాయిలో పైరవీ చేసుకుని  నాగర్​కర్నూలు జిల్లాలో పని చేస్తున్న తన సమీప బంధువును  వనపర్తి  జిల్లాకు డిప్యూటేషన్ పై రప్పించారు. అక్రమ  డిప్యుటేషన్ల వ్యవహారం టీచర్లలో అసంతృప్తి పెరుగుతోంది. ఇదిలా ఉంటే,  వనపర్తి జిల్లాలో  నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కొల్లాపూరు సెగ్మెంటులో మూడు, మక్తల్​లో రెండు, దేవరకద్ర లో   రెండు, వనపర్తిలో ఎనిమిది మండలాలున్నాయి. వనపర్తి సెగ్మెంటు పరిధిలోని స్కూళ్లలో  ఇతర సెగ్మెంట్లకు చెందిన టీచర్లను   డిప్యుటేషన్​ వేస్తుండడంపైనా టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.