పాక్: బస్సును లారీ ఢీకొట్టి 30 మంది మృతి

పాక్: బస్సును లారీ ఢీకొట్టి 30 మంది మృతి

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిండుగా ప్రయాణికులతో వెళ్తున్న బస్సును లారీ ఢీకొట్టడంతో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో సుమారు 40 మంది వరకు గాయపడ్డారు. పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రం డేరా ఘాజీ ఖాన్ జిల్లాలో సోమవారం ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఎక్కువ మంది బక్రీద్ పండుగ చేసుకోవడం కోసం సొంతూర్లకు తరలి వెళ్తున్న కూలీలే ఉన్నారని అధికారులు చెప్పారు. సియాల్‌ కోట్‌ నుంచి రాజన్‌పూర్‌‌కు వెళ్తున్న బస్సు ఇండస్ హైవేపై వెళ్తుండగా టౌన్సా బైపాస్‌ దగ్గర బస్సు, లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగానే 18 మంది మరణించారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 30 మంది మరణించారని పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి ట్వీట్ చేశారు. డ్రైవర్‌‌ నిద్ర మత్రు కారణంగా సడన్‌గా బస్సు కంట్రోల్ తప్పిందని, అందులో ప్రయాణిస్తున్న ఓ పోలీస్ అధికారి చెప్పారు.