కష్టమైన పాఠాల్ని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం కోసం బ్లాక్బోర్డ్ మీద బొమ్మలు వేస్తారు చాలామంది టీచర్లు. కొందరేమో కలర్ పేపర్లు, అట్టముక్కలతో తయారుచేసిన బొమ్మలు వాడతారు. అయితే, స్కూల్ పిల్లల నుంచి కాలేజీ స్టూడెంట్ల వరకు సైన్స్ విషయాలు ఈజీగా నేర్చుకునేందుకు ‘ట్యూటర్’ అనే యాప్ తెచ్చారు వీళ్లు. ఆగ్మెంట్ టెక్నాలజీతో పనిచేసే ఈ యాప్ని కేరళకు చెందిన ముగ్గురు ఇంజనీర్లు తయారుచేశారు. స్టార్టప్ యాప్తో త్రీడి క్లాసులు అందిస్తున్న వీళ్ల ఇన్నొవేషన్ గురించి...
సెయింట్ జోసెఫ్ కాలేజీ ఇంజనీరింగ్, టెక్నాలజీకి చెందిన థామ్సన్ టామ్, త్రిస్సూర్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన పాలా, శ్యామ్ ప్రదీప్ అలీల్ ఈ యాప్ని తయారుచేశారు. పాలా, శ్యామ్కి ఇనిస్టిట్యూట్ ఆఫ్ గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజీలో పరిచయం. అక్కడ చదువుకునే టైంలో ఆగ్మెంట్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ మీద రీసెర్చ్ చేసేవాళ్లు. మనదేశంలోని అన్ని ఇనిస్టిట్యూట్స్, కాలేజీలకు ఈ కొత్తరకం టెక్నాలజీని అందుబాటులోకి తేవాలని కలలు కనేవాళ్లు ఈ ఇద్దరు. వీళ్లకు థామ్సన్ తోడయ్యాడు.
కరోనా ఫస్ట్వేవ్లోనే
కరోనా వచ్చిన మొదట్లో స్కూళ్లు మూతపడడంతో పిల్లల చదువులు ఆగిపోయాయి. ఆ టైంలో ఆగ్మెంట్, వర్చువల్ రియాలిటీ యాప్ ఉంటే పిల్లలు, టీచర్లకు చాలా ఉపయోగపడుతుంది అనుకున్నారు వీళ్లు. అయితే, వర్చువల్ రియాలిటీ ద్వారా క్లాసులు వినేందుకు హెడ్సెట్స్ కావాలి. అంతేకాదు టీచర్లు, స్టూడెంట్లకు ఆ టెక్నాలజీని వాడడంలో ట్రైనింగ్ ఇవ్వాలి. అందుకని ఆగ్మెంట్ టెక్నాలజీ సాయంతో క్లాస్రూమ్ని డిజిటల్ క్లాస్రూమ్గా మార్చాలని అనుకున్నారు ఈ ముగ్గురు. అందుకోసం ‘ట్యూటర్’ అనే యాప్ తయారుచేశారు. ఈ యాప్ని స్మార్ట్ఫోన్లో, విండోస్, మ్యాక్లో డౌన్లోడ్ చేసుకుని, పాఠాలు వినొచ్చు. ఈ యాప్ ఇంటర్నెట్ లేకపోయినా కూడా పనిచేస్తుంది.
ఎలా పనిచేస్తుందంటే...
‘ట్యూటర్’ యాప్లో ఆగ్మెంట్ టెక్నాలజీ సాయంతో త్రీడి మోడల్స్ని చూడొచ్చు. ఉదాహరణకు మనిషి గుండె, కండ్ల గురించి చెప్పడానికి... త్రీడి గుండె, త్రీడి కండ్లను చూపిస్తూ, క్లాస్లు చెప్తారు టీచర్లు. దాంతో పిల్లలు తొందరగా వాటి గురించి అర్థం చేసుకుంటారు. ఇలా క్లాస్లు చెప్తే వాళ్లకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. స్కూల్ కరిక్యులమ్లోని ముఖ్యమైన పాఠాల్ని త్రీడి బొమ్మలుగా చేస్తారు. అందుకోసం త్రీడీ మోడల్ డెవలపర్స్తో పాటు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వీళ్లు టీచర్లు, స్టూడెంట్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ప్రతి నెలా యాప్ని అప్డేట్ చేస్తారు.
అదే మా ఉద్దేశం
“మా యాప్ని సబ్స్క్రయిబ్ చేసుకోవచ్చు. ఏడాదికి సబ్స్క్రిప్షన్ ధర దాదాపు యాభై వేలు. అయితే, సబ్జెక్ట్, యాప్ని డౌన్లోడ్ చేసుకునే టీచర్ల సంఖ్యని బట్టి ఈ ధర మారుతుంది. ట్యుటర్ యాప్ని ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 150కి పైగా స్కూళ్లలో వాడుతున్నారు. టెక్నాలజీ సాయంతో ఏ విషయం అయినా తొందరగా, ఈజీగా నేర్చుకునేలా చేయడమే మా ఉద్దేశం’’ అంటున్నాడు ఈ యాప్ తయారుచేసిన ముగ్గురిలో ఒకడైన శ్యామ్ ప్రదీప్ అలీల్.