
- దళిత బంధు, పోడు పట్టాలు, సొంత జాగాలో ఇండ్లకు రూ.3 లక్షలుపై ఓన్లీ రివ్యూలే
- సీఎం స్థాయిలోనే ఏడు సార్లు ఉన్నతస్థాయి మీటింగ్స్
- గైడ్లైన్స్ పంపినా ఆమోదించకుండా పెండింగ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న స్కీముల తీరు ఒకడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుంది. దళితబంధు, పోడు భూములకు పట్టాలు, సొంత జాగా ఉన్నోళ్లకు ఇండ్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయంపై ప్రభుత్వం సాగదీస్తూ వస్తున్నది. కొన్ని నెలలుగా రివ్యూల పేరుతో మీటింగులు పెట్టుడేతప్ప.. వాటిని అమలు చేయడం లేదు. ప్రతి మీటింగులో ఇదిగో.. అదిగో అని ఊరిస్తూ ప్రకటనలు రావడం.. ఆ తరువాత అమలు చేయకపోవడం పరిపాటిగా మారింది.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన నాలుగు కేబినెట్ మీటింగ్లలో.. మరో మూడు, నాలుగు సార్లు జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలోనూ ఈ మూడు స్కీంల గురించి చర్చించి ఆదేశాలు జారీ చేశారు. ఆఫీసర్లు అంతే హడావుడిగా గైడ్లైన్స్ ఇతరత్రా వివరాలన్నీ రిపోర్ట్ రెడీ చేసి పంపించారు. అయితే అవన్ని కూడా ఆమోదించకుండా పెండింగ్లో పెడుతున్నారు. ఫలితంగా అర్హులైన లక్షలాది కుటుంబాలు ఆ స్కీములు ఎప్పుడెప్పుడా అని ఎదరుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది.
పైనుంచి కింది దాకా ఓన్లీ మీటింగ్స్
పోడు భూములు, సొంత జాగాలు ఉంటే ఇచ్చే ఆర్థిక సాయంపై ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీలు కూడా ఏర్పాటు చేసింది. మార్చి నెలలోనే ఈ రెండింటిపై సీఎం కేసీఆర్ రెండు సార్లు చర్చించి ఆదేశాలు జారీ చేశారు. సీఎస్ రెండు సార్లు రివ్యూ చేశారు. డిపార్ట్మెంట్ల ప్రిన్సిపల్ సెక్రటరీలు వారానికి రెండు, మూడు మార్లు సమీక్షించారు. అయినా మీటింగుల్లో మాటలే తప్ప.. కాగితాలపై సంతకాలు కావడం లేదు. అవి అమల్లోకి రావడం లేదు. తాజాగా ఈ నెల 28న కూడా సీఎం కేసీఆర్ ఈ మూడు స్కీములపై రివ్యూ చేసి త్వరగా అమలు చేయాలన్నారు.
ఈ నెల 9న జరిగిన కేబినెట్ భేటీలోనూ అదే విషయం చెప్పారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లలోనూ సీఎస్ శాంతి కుమారి మూడు సార్లు ఇదే విషయపై సమీక్షించారు. అంటే ఈ ఒక్క నెలలోనే 12 సార్లు చర్చించారే తప్ప.. వాటి అమలులో ఎలాంటి పురోగతి లేదు. ఇక ఫిబ్రవరి నెలలో అసెంబ్లీలో పోడు భూముల గురించి మాట్లాడిన సీఎం కేసీఆర్.. పట్టాలు ఇచ్చేస్తామని అధికారులతో రివ్యూ చేసినట్లు చెప్పారు. కేబినేట్ సబ్ కమిటీ భేటీ అయి చర్చించింది. సీఎస్ కూడా ఎప్పటిలాగే రెండుసార్లు రివ్యూ చేశారు. అయినా అది అతీగతీ లేకుండా పోయింది. గత 5 నెలలలో మూడు స్కీంలపై దాదాపు 40 సార్లు మీటింగ్స్ జరిగినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు.
తలపట్టుకుంటున్న ఆఫీసర్లు
ప్రధానమైన ఈ మూడు స్కీములకు లక్షలాది మంది అర్హులు ఎదరుచూస్తున్నారు. దళితబంధు కోసం 1.77 లక్షల మంది, సొంత జాగా ఆర్థిక సాయం కోసం 4 లక్షల మంది, పోడు భూముల పట్టాల కోసం 2.35 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. వీరంతా ఆఫీసుల చుట్టూ, అధికారులు, ఎమ్మెల్యేల చూట్టూ తిరుగుతున్నారు. రివ్యూలు, మీటింగులే తప్ప ప్రభుత్వం నుంచి పైసా రావడం లేదని.. ముందుకు వెళ్లమని ఆదేశాలు ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. హడావుడి చేయడం తప్పితే.. కనీసం మార్గదర్శకాలకు ఆమోదం ఇస్తలేరని చెప్తున్నారు. మరోవైపు రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రభుత్వం ఆలస్యం చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలకు సరిగ్గా 4 నెలల ముందు మొదలుపెట్టాలనే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలిసింది.
పంపిన గైడ్లైన్స్ పెండింగ్లో పెడ్తున్నరు
దళితబంధు స్కీం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు కింద అమలైంది. అయితే లబ్ధిదారుల ఎంపిక విషయంలో కోర్టులో కేసు ఫైల్ కావడంతో దీనిపై డిపార్ట్మెంట్ కొన్ని మార్పులు చేసింది. జిల్లాల్లో ఆయా జిల్లా మంత్రి ఛైర్ పర్సన్గా కలెక్టర్, ఎమ్మెల్యే, మండలాధికారులు సభ్యులుగా లబ్ధిదారుల ఎంపిక కమిటీ ఉండాలని ప్రతిపాదించారు. ఆన్లైన్లో తీసుకున్న అప్లికేషన్లను ఆ కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకునేలా మార్గదర్శకాలు రెడీ చేసి ప్రభుత్వానికి పంపింది. ఇది జరిగి నాలుగు నెలలు కావొస్తోంది.
అయినా ఆమోదించడం లేదు. ఇక సొంత జాగా ఉంటే ఇండ్లు కట్టేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం దానిపైనా కూడా లబ్ధిదారుల ఎంపికకకు మార్గదర్శకాలు రెడీ చేశారు. కనీసం 60 గజాల స్థలం, అసలు ఇండ్లు లేకుండా ఉన్నోళ్లకు ఇవ్వాలనే ప్రపోజల్స్ రెడీ చేసి పంపారు. వాటిపైన కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక పోడు భూముల సమస్య అంతా సిద్ధంగా ఉన్నప్పటికీ పట్టాలు పంపిణీ చేయడం లేదు. పోడు పట్టాలకు సంబంధించిన అంశం ఏడాది నుంచి ములుగుతూనే ఉన్నది.