- పుణేకి కొత్తగా వెళ్లిన టెకీకి ఆటోవాలా బిల్లు
రమేశ్.. అప్పుడే సిటీకి కొత్తగా వచ్చాడు. ఎక్కడ ఏం ఉంటుందో, ఏ బస్సెక్కాలో, ఎలా వెళ్లాలో తెలియదు. ఓ ఆటోవాలాకు అడ్రస్ చెప్పి ఆటో ఎక్కాడు. కొత్త అని తెలుసుకున్న డ్రైవర్ అతడి జేబును గుల్ల చేశాడు. ఇట్లాంటి అనుభవమే బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు పుణేలో ఎదురైంది. 18 కిలోమీటర్ల ప్రయాణానికి రూ. 4,300 వసూలు చేశాడు ఆటో డ్రైవర్.
బుధవారం జరిగిన ఈ ఘటనపై ఆ టెకీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తెల్లవారు జామున రైలు దిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎరవాడ వెళ్లేందుకు క్యాబ్ల కోసం చూశాడు. ఏవీ లేకపోవడంతో అటుగా పోతున్న ఆటోను పిలిచి మాట్లాడుకున్నాడు. ఒకతను డ్రైవ్ చేస్తుండగా, అసలు డ్రైవర్ అయిన వ్యక్తి వెనక కూర్చున్నాడు. ఆ ఆటోవాలా మీటర్ సెట్ చేశాడో లేదో చూసుకోకుండానే ఆ టెకీ ఆటో ఎక్కాడు. తీరా దిగాక అతడికి దిమ్మ తిరిగిపోయే షాకిచ్చారు ఆ ఇద్దరు వ్యక్తులు. రూ. 4,300 కట్టాల్సిందిగా డిమాండ్ చేశారు. టెకీ ఎదురు తిరిగితే, సిటీలో ఎంటరవడానికి ₹600, సిటీ నుంచి వెళ్లిపోవడానికి ఇంకో 600 తమ దగ్గరి నుంచి వసూలు చేశారని చెప్పి మొత్తం కట్టాల్సిందిగా బెదిరించారు.
అప్పటికీ ఇంకా చీకటిగానే ఉండడం, అక్కడ ఎవరూ లేకపోవడంతో భయపడిపోయిన ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్లు అడిగినన్ని డబ్బులు ఇచ్చాడు. అక్కడి నుంచి కంపెనీ ఇచ్చిన క్వార్టర్కు వెళ్లాడు. తెల్లారి ఎరవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జరిగినదంతా వివరించాడు. ఆటో నంబర్ను పోలీసులకిచ్చాడు. ఆ టైంలో అసలైన డ్రైవర్ తాగి ఉన్నాడని, పోలీసులు పట్టుకోకుండా ఉండేందుకు తన ఫ్రెండ్ ఆటో నడుపుతాడంటూ ఆ డ్రైవర్ చెప్పాడని బాధిత టెకీ వివరించాడు.