బెంగళూరు: పనితీరు బాగా లేదని పేర్కొంటూ ఐటీ సేవల కంపెనీ విప్రో 452 మంది ఫ్రెషర్ల ఉద్యోగాలను తీసేసింది. ట్రెయినింగ్ ఇచ్చాక నిర్వహించిన ఇంటర్నల్ టెస్ట్లో ఫెయిల్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఆన్లైన్ ప్లాట్ఫారమ్ నేషనల్ లెవల్ టాలెంట్ హంట్ (ఎన్ఎల్టీహెచ్) ద్వారా విప్రో భారీ సంఖ్యలో ఫ్రెషర్లను నియమించుకుంది. 128 నిమిషాల అసెస్మెంట్ ద్వారా అభ్యర్థి ప్రతిభ, రాతపూర్వక, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆన్లైన్ ప్రోగ్రామింగ్ సామర్థ్యాలను పరీక్షించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు క్వార్టర్లో (మునుపటి క్వార్టర్తో పోలిస్తే) విప్రో హెడ్కౌంట్ దాదాపు 500 తగ్గింది.
ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కంపెనీ 30 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని భావించింది. దానికి తగ్గట్టే మొదటి తొమ్మిది నెలల్లో 17,000 మందిని నియమించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో మరో 5,000 మందిని నియమించుకోనున్నట్లు కంపెనీ సిహెచ్ఆర్ఓ సౌరభ్ గోవిల్ తెలిపారు. అంటే 22,000 మందిని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్లోడౌన్ వల్ల ఐటీ ఎక్స్పర్టులకు డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో కంపెనీ కొత్త రిక్రూట్మెంట్లను నిర్వహించడం లేదు సరికదా ఫ్రెషర్లను తొలగించింది. విప్రో మాదిరే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్వంటివి ఉద్యోగాలను తొలగించే పనిలో ఉన్నాయి.