- ఎంఎస్పీ చట్టబద్ధతపై ఆర్డినెన్స్ తేవాలె
- ఢిల్లీ బార్డర్లలో ఐదో రోజు కొనసాగిన రైతుల నిరసన
- తంజావూరులో 100 మంది రైతుల అరెస్ట్
- నిరసనలతో ఉత్తరాదికి రోజుకు 500 కోట్ల నష్టం
- ఇయ్యాల రైతులతో కేంద్రం మరోసారి చర్చలు
న్యూఢిల్లీ: ఎమ్ఎస్పీకి చట్టబద్ధత సహా వివిధ డిమాండ్లపై రైతులు చేపట్టిన చలో ఢిల్లీ పాదయాత్ర ఐదవ రోజుకు చేరుకుంది. పంజాబ్–హర్యానా (శంభు) సరిహద్దులో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్లింగ్ ప్రయోగించారు. రైతులు కూడా పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. దాంతో శంభు సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనలో భాగంగా శనివారం భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహన్) పంజాబ్లోని సీనియర్ బీజేపీ నేతల ఇండ్ల ముందు ధర్నాలు చేపట్టింది. అలాగే.. భారతీయ కిసాన్ యూనియన్ (చారూణి) హర్యానాలో ట్రాక్టర్ మార్చ్ చేపట్టింది.150కి పైగా ట్రాక్టర్లు ర్యాలీలో పాల్గొన్నాయి.
ఎంఎస్పీపై ఆర్డినెన్స్ తీసుకురండి
రైతుల నిరసనను ఆపాలనుకుంటే ఎంఎస్పీకి చట్టపరమైన హామీ ఇవ్వడంపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావాలని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ డిమాండ్ చేశారు. రాజకీయ నిర్ణయాలు తీసుకునే హక్కు కేంద్రానికి ఉందని చెప్పారు. కేంద్రం అనుకుంటే రాత్రికి రాత్రే ఎంఎస్పీపై ఆర్డినెన్స్ తేవచ్చన్నారు.
తంజావూరులో రైతుల అరెస్ట్
ఢిల్లీలో రైతుల ఆందోళనపై పోలీసుల చర్యను నిరసిస్తూ తమిళనాడులో రైతులు నిరసనకు దిగారు. శనివారం తంజావూరు రైల్వే స్టేషన్లో వివిధ రైతు సంఘాలకు చెందిన రైతులు చోళన్ ఎక్స్ప్రెస్ ముందు ధర్నా చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 100 మంది రైతులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
రోజూ రూ.500 కోట్ల నష్టం:పీహెచ్డీసీసీఐ
ఉత్తరాది రాష్ట్రాల్లో కొనసాగుతున్న రైతుల నిరసనతో పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. రోజుకు రూ. 500 కోట్లకు పైగా బిజినెస్ నష్టం వస్తున్నదని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్డీసీసీఐ) వెల్లడించింది. అనేక మంది ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నేడు మరోసారి రైతులతో చర్చ
రైతు నేతలతో నాలుగో విడత చర్చల కోసం కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ ఆదివారం సమావేశం కానున్నారు. ఈ నెల8, 12, 15 తేదీల్లో ఇరుపక్షాలు సమావేశమైనప్పటికీ ఆ చర్చలు విఫలమయ్యాయి. కాగా.. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) ఆథరైజ్డ్ క్యాపిటల్ ను కేంద్రం రూ. 10 వేలకోట్ల నుంచి రూ. 21 వేలకోట్లకు పెంచాలని నిర్ణయించింది. దీనివల్ల వ్యవసాయ రంగం మరింత బలోపేతం అవుతుందని కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది.