- ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం
- అధికారులతో ప్రధాని మోడీ సమీక్ష
- దేశంలో 34 కు పెరిగిన కొవిడ్ కేసులు
- లడఖ్లో ఇద్దరికి, తమిళనాడులో ఒకరికి పాజిటివ్
కరోనా టెస్టుల కోసం దేశవ్యాప్తంగా 52 ల్యాబ్ లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటిదాకా వైరస్ కన్ఫర్మేషన్ కోసం ఒక్క పుణె నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)పైనే ఆధారపడాల్సి వస్తోంది. అనుమానిత కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వేగంగా టెస్టు చేయాలన్న ఉద్దేశంతో 52 ల్యాబ్ లను ఏర్పాటు చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్. శాంపిల్ కలెక్షన్ కోసం మరో 57 ల్యాబ్ లను ఏర్పాటు చేసింది. మన రాష్ట్రంలో ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో టెస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. 52 ల్యాబ్ లలో గాంధీ ఆస్పత్రినీ చేర్చింది కేంద్ర ప్రభుత్వం. ఏపీలోని తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ, అనంతపూర్లోని జీఎంసీల్లోనూ కరోనా టెస్టింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేసింది.
మోడీ రివ్యూ
కరోనా పరిస్థితిపై వివిధ ప్రభుత్వ శాఖలతో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సమీక్షించారు. క్వారెంటైన్ ఫెసిలిటీలను పెంచాలని, అందుకు అవసరమైన స్థలాలను చూడాలని అధికారులను ఆదేశించారు. వ్యాధి మరింత వ్యాపించకుండా క్రిటికల్ కేర్కు సంబంధించిన రూల్స్ను తయారు చేయాల్సిందిగా సూచించారు. జనం ఎక్కడా గుమిగూడకుండా జాగ్రత్తలు సూచించాలని అధికారులకు చెప్పారు. జనాలకు కరోనాపై అవగాహన కల్పించాలని, అందుకు అన్ని డిపార్ట్మెంట్లు కలసికట్టుగా పనిచేయాలని చెప్పారు. కొవిడ్ మేనేజ్మెంట్కు ప్రపంచ దేశాలు తీసుకుంటున్న బెస్ట్ పద్ధతులపై స్టడీ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇరాన్లో చిక్కుకున్న ఇండియన్లను వీలైనంత తొందరగా ఇండియాకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. కాగా, శనివారం ఇరాన్లో చిక్కుకున్న 300 మంది ఇండియన్ల శాంపిళ్లను టెస్ట్ కోసం మహాన్ ఎయిర్ఫ్లైట్లో ఇండియాకు తీసుకొచ్చారు.
34 కేసులు
దేశంలో కొవిడ్ కేసులు 34కి పెరిగాయి. లడఖ్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. ఇంకో కేసు తమిళనాడులో నమోదైంది. యూఏఈలో ఓ ఇండియన్కూ కొవిడ్ పాజిటివ్గా తేలింది. శనివారం 15 కొత్త కేసులు నమోదవగా అందులో ఇండియన్ ఉన్నాడంటూ యూఏఈ అధికారులు తెలిపారు. కాలిఫోర్నియాలో డాక్ చేసిన గ్రాండ్ ప్రిన్సెస్ షిప్పులో 21 మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చిందని అమెరికా వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ చెప్పారు. షిప్పులో మొత్తం 3,500 మంది దాకా ఉన్నారని చెప్పారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య 1,03,950కి చేరింది. 3,524 మంది చనిపోయారు. చైనాలో ఎక్కువగా 3,070 మంది కొవిడ్కు బలయ్యారు. 80,651 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటలీలో 197 మంది, ఇరాన్లో 145 మంది చనిపోయారు. దక్షిణ కొరియాలో 48 మంది చనిపోగా, అమెరికాలో చనిపోయిన వారి సంఖ్య 17కి పెరిగింది.