పౌరసత్వ చట్టానికి మద్దతుగా 52 లక్షల కాల్స్

పౌరసత్వ చట్టానికి మద్దతుగా 52 లక్షల కాల్స్

పౌరసత్వ చట్టానికి మద్దతును ప్రకటిస్తూ తమకు 52 లక్షల ఫోన్ కాల్స్ వచ్చాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సీఏఏకు దేశవ్యాప్త మద్దతును సమీకరించాలనే ఉద్దేశంతో బీజేపీ శుక్రవారం మిస్‌డ్ కాల్ పద్దతిని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం 8866288662 టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటుచేసింది. ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు ప్రజల నుంచి భారీగా మద్ధతు లభిస్తుంది.

తాము ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్‌కు సోమవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 68 లక్షల కాల్స్ వచ్చాయని అమిత్ షా తెలిపారు. వాటన్నింటిలో 52 లక్షల 72 వేల కాల్స్ వెరిఫైడ్ కాల్స్‌గా తేలాయని ఆయన చెప్పారు. డిసెంబర్‌లో ఈ చట్టం అమలులోకి వచ్చినప్పటినుంచి దేశవ్యాప్తంగా CAAకి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ప్రజలకు CAA పట్ల ఉన్న అనుమానాలన్నింటిని తొలగించేందుకు బీజేపీ ఆదివారం నుంచి ‘డోర్-టు-డోర్’కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు.

అమిత్ షా సోమవారం ఢిల్లీలోని లజపత్ నగర్‌లో సందర్శించారు. సవరించిన పౌరసత్వ చట్టం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలతో మాట్లాడారు. వారిలో ఈ చట్టం పట్ల అవగాహాన పెంచేందుకు ఆయన ప్రయత్నించారు. అంతేకాకుండా.. ఆయనే స్వయంగా ఈ అంశానికి సంబంధించిన కరపత్రాలను కూడా పంపిణీ చేశారు.