
- ఏకే-47, ఎస్ఎల్ఆర్ ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలు స్వాధీనం
- కొనసాగుతున్న కూంబింగ్
భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. నారాయణ్ పూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో శుక్రవారం మధ్యాహ్నం మావోయిస్టులు సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో బలగాలను కూంబింగ్కు పంపించామని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఆరుగురు మావోయిస్టుల మృతి చెందారు.
మరికొంత మంది అడవిలోకి పారిపోయారు. ఘటనా స్థలం నుంచి ఏకే-47, ఎస్ఎల్ఆర్ ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల సమావేశ ప్రాంతంలో నిత్యావసర సరుకులు, మందులు కూడా దొరికాయి. డెడ్బాడీలతో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను నారాయణ్ పూర్కు తరలిస్తున్నారు. మావోయిస్టులు కౌంటర్ ఎటాక్ జరిపే అవకాశం ఉండటంతో అదనపు బలగాలను బ్యాకప్ టీంలుగా పంపినట్లు ఐజీ వెల్లడించారు.