తల్లి అంత్యక్రియలు చేసిన కొద్ది రోజులకే కరోనాతో ఐదుగురు కొడుకులు మృతి

తల్లి అంత్యక్రియలు చేసిన కొద్ది రోజులకే కరోనాతో ఐదుగురు కొడుకులు మృతి

ఒకే కుటుంబంలో ఆరుగురి ప్రాణాలను మింగేసింది కరోనా మహమ్మారి. 16 రోజుల గ్యాప్‌లో తల్లి సహా ఐదుగురు కొడుకులు ఈ వైరస్ బారినపడి ఒకరి తర్వాత మరొకరు మరణించారు. ఈ విషాదకర ఘటన జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో జరిగింది.

జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లా కాట్రాస్‌కు చెందిన 88 ఏళ్ల మహిళ ఢిల్లీలోని తన కొడుకు దగ్గర ఉండేది. అయితే బంధువుల పెళ్లిలో పాల్గొనేందుకు ఆమె జూన్ చివరిలో ధన్‌బాద్ వెళ్లింది. ఆ వివాహ వేడుక ముగిసిన తర్వాత కాట్రాస్‌లో ఉన్న స్వగ్రామానికి వెళ్లింది. ఆమె అనారోగ్యం పాలవడంతో బొకారోలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్ది రోజులకే జూలై 4న ఆ మహిళ మరణించింది. దీంతో ఊరిలో ఆమె ఐదుగురు కొడుకులు కలిసి అంత్యక్రియలు పూర్తి చేశారు. కానీ దురదృష్టవశాత్తు అంతిమ సంస్కారాలు ముగిసిన తర్వాత కొద్ది రోజులకు ఆమె మరణానికి కారణం కరోనా వైరస్ సోకడమేనని తెలిసింది. ముందుగా తెలియపోవడంతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా అంత్యక్రియలు చేయడంతో ఆమె కొడుకులు కూడా కరోనా బారినపడ్డారు. నాటి నుంచి జూలై 20 మధ్య ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఈ అయిదుగురి వయసూ 60 ఏళ్ల పైనే ఉంటుందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆ మహిళ సంతానంలో ఢిల్లీలో ఉన్న కొడుకు ఒక్కడే మిగిలాడు.