- మృతుల్లో ఇద్దరు చిన్నారులు.. రాజస్థాన్లో ఘటన
జైపూర్: రాజస్థాన్లోని సికార్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ట్రక్కును కారు ఢీకొనడంతో మంటలు చెలరేగి ఏడుగురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. సికార్ జిల్లాలోని ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు చురు–సాలాసర్ హైవేపై వేగంగా వస్తున్న ఓ కారు.. పత్తి లోడ్తో ముందు వెళ్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది.
దీంతో ట్రక్కులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు కారుకు అంటుకున్నాయి. కారు డోర్లు వెంటనే తెరుచుకోకపోవడంతో అందులో ఉన్న ఏడుగురు సజీవ దహనం అయ్యారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అనంతరం డెడ్బాడీలను బయటకు తీసి, పోస్ట్మార్టం కోసం హాస్పిటల్కు తరలించారు. మృతులంతా ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీరంతా సలాసర్ బాలాజీ టెంపుల్ నుంచి హిసార్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు.