దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని కుట్రలు చేస్తున్న ముష్కర మూకలకు భారత ఆర్మీ తగిన బుద్ధి చెబుతోంది. యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో ఈ ఏడాది మొదటి నుంచి నేటి వరకు 93 ఉగ్రవాదులను మట్టుబెట్టింది. సరిహద్దు దాటి దేశంలోకి వస్తున్న జైషే మహమ్మద్, లష్కరే తొయిబా సహా పలు టెర్రర్ గ్రూపులకు చెందిన ఉగ్రవాదులను జమ్ము కశ్మీర్ లొ అంతం చేసినట్లు ఆర్మీ వెల్లడించింది. గడిచిన రెండు రోజుల్లోనే 9 మంది ముష్కరులు ఎదురు కాల్పుల్లో హతమయ్యారని చెప్పింది. ఈ రెండ్రోజుల్లో జవాన్లలో ఎటువంటి ప్రాణ నష్టం లేదని తెలిపింది. చొరబాట్లను ఎదుర్కొనేందుకు వాస్తవాధీన రేఖ వెంట నిరంతరం ఆపరేషన్లు కొనసాగుతుంటాయని, అలాగే జమ్ము కశ్మీర్ అంతర్భాగంలోనూ టెర్రరిస్టుల ఏరివేత జరుగుతోందని చెప్పింది. పాకిస్థాన్ కొత్తగా సృష్టించిన రెసిస్టెన్స్ ఫ్రంట్ సహా జైషే మహమ్మద్, లష్కరే తొయిబా టాప్ కమాండర్లైన రియాజ్ నైకూ, జునైత్ సెహ్రియా వంటి పలువురిని ఈ ఏడాదిలో ఆర్మీ మట్టుబెట్టింది.
గత నెలలో కెరన్ సెక్టార్ లో చొరబాటుదారులను ఎదుర్కొనేందుకు చేపట్టిన ఆపరేషన్ లో ఐదుగురు పారామిటరీ సైనికులను కోల్పోయినట్లు ఆర్మీ చెప్పింది. ఈ ఆపరేషన్ లో ఐదుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి మన బలగాలు. అలాగే మే నెలలోనే హంద్వారాలో జరిగిన ఎన్ కౌంటర్లో ఒక కల్నల్ సహా ముగ్గురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. ఇటీవల కొద్ది రోజులుగా జరుగుతున్న యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో మన సైనికుల ప్రాణాలు కాపాడుకుంటూనే ముష్కరులను మట్టుబెట్టినట్లు ఆర్మీ అధికారులు చెప్పారు.అయితే సరిహద్దు ప్రాంతాల్లో మంచు క్లియర్ అవుతుండడంతో వాతావరణం అనువుగా ఉందని పాక్ టెర్రరిస్టులు ఎక్కువ సంఖ్యలో కశ్మీర్ లోకి చొరబాట్లకు ప్రయత్నిస్తారని, దీంతో యాంటీ టెర్రర్ ఆపరేషన్లు ఇంకా పెరిగే చాన్స్ ఉందని చెబుతున్నారు.