
అందరిలెక్క ఆలోచిస్తే ఏమొస్తది అనుకున్నడు బెంగళూరులోని ఓ టిఫిన్ బండి వ్యాపారి. కాస్త ‘వెరైటీ’గా ఆలోచించిండు. దోశ, ఇడ్లీ, వడను చట్నీ, సాంబార్తోనే ఎందుకు తినాలి? ఐస్క్రీమ్తో తింటె ఎట్లుంటది? అనుకున్నడు. ఇంకేముంది కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిండు. ఐస్క్రీమ్ కాంబినేషన్తో రకరకాల మెనూలు సిద్ధం చేసిండు. అక్కడ అమ్మే దోశకు చట్నీ ఉండదు. ఐస్క్రీంతో కలిపి తినాల్సిందే. దోశకు పైనా, కింద కూడా ఐస్క్రీమ్ పూత పూస్తరు. అట్లా ఇట్లా ఆ టిఫిన్ సెంటర్ పేరు సోషల్ మీడియాలో మార్మోగింది. అది కాస్త ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రకు కనబడింది. ‘ఐస్క్రీమ్ దోశ ఏమో గాని, ఆ టిఫిన్ సెంటర్ వ్యాపారి ఆలోచన సూపర్’ అని ట్విట్టర్లో ఆయన పోస్టు పెట్టారు. ‘నేను ఐస్ క్రీం దోశకు ఫ్యాన్ కాదు. అయినా ఆ వ్యాపారి ఆలోచనకు ఫిదా అయ్యాను. దేశంలో చిరు వ్యాపారుల్లో అద్భుతమైన సృజనాత్మకత ఉంది’ అని ట్వీట్ చేశారు. టిఫిన్ సెంటర్ వ్యాపారి ఐడియా అద్భుతమని కొందరు పొగుడుతుంటే.. ఇంకొందరు ‘అబ్బే బాగుండదు’ అంటున్నారు.