చదివింది జనరల్​ సర్జన్​చేస్తున్నవి సిజేరియన్లు

చదివింది జనరల్​ సర్జన్​చేస్తున్నవి సిజేరియన్లు
  •     సూర్యాపేటలో డీఎంహెచ్​వో తనిఖీల్లో బయటపడ్డ బాగోతం   
  •     రెండు నెలల్లో 48 మంది వస్తే  46 మందికి సిజేరియన్​
  •     సుప్రజా హాస్పిటల్ ఆపరేషన్​థియేటర్, ల్యాబ్ సీజ్ 

సూర్యాపేట, వెలుగు:  సూర్యాపేటలో జనరల్ సర్జన్ చదివిన ఓ డాక్టర్​ గైనకాలజిస్ట్ గా మారి ప్రసూతి ఆపరేషన్లు చేస్తుండడంతో జిల్లా వైద్యాధికారులు ఆపరేషన్ ​థియేటర్​, ల్యాబ్ ​సీజ్​చేశారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే హాస్పిటల్ ​సీజ్ ​చేస్తామని నోటీసులిచ్చారు. మంగళవారం సూర్యాపేటలోని పలు హాస్పిటల్స్ లో డీఎంహెచ్ వో డాక్టర్ కోట చలం ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రజా హాస్పిటల్ లో ఎమ్మెస్ ​(జనరల్ సర్జన్) చదివిన డాక్టర్​ సుప్రజ గైనకాలజిస్ట్ చేయాల్సిన ప్రసూతి ఆపరేషన్లు చేస్తున్నట్టు గుర్తించారు. 

మార్చి నెల నుంచి ఇప్పటివరకు 46  సిజేరియన్లు చేసినట్టు తేల్చారు. అంతేకాకుండా అపరేషన్ల సమయంలో అనస్తీషియా డాక్టర్ ​లేకపోవడంతో జనరల్​ సర్జనే మత్తు ఇంజక్షన్లు ఇచ్చి ఆపరేషన్లు చేస్తున్నట్టు తెలుసుకున్నారు. ల్యాబ్​లో వినియోగించే పాథాలజీ  కెమికల్స్ ఫ్రీజర్​లో కాకుండా బయటనే పెట్టి పరీక్షలు చేస్తుండడం, ఆపరేషన్ థియేటర్ రూల్స్​కు విరుద్ధంగా ఉండడంతో రెండింటినీ సీజ్ చేశారు. 

అర్హత లేని వారిని నర్సింగ్ ​స్టాఫ్​గా పెట్టుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లో సంజాయిషీ ఇవ్వకపోతే హాస్పిటల్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. డీఎంహెచ్​వో డాక్టర్ కోట చలం మాట్లాడుతూ రూల్స్ ప్రకారం జనరల్ సర్జన్ ప్రసూతి ఆపరేషన్లు చేయకూడదని, అయినా రెండు నెలల్లో 48 మంది గర్భిణులు వస్తే 46 సిజేరియన్లు చేశారన్నారు. గతంలో నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినా మేనేజ్​మెంట్​లో మార్పు రాలేదన్నారు. ఈ తనిఖీల్లో డెమో అంజయ్య, వైద్య ఆరోగ్యశాఖాధికారులు పాల్గొన్నారు.