జీ-20 వేదిక ఎదుట నటరాజ విగ్రహం.. దీని ప్రత్యేకతలు ఇవే..!

జీ-20 వేదిక ఎదుట నటరాజ విగ్రహం.. దీని ప్రత్యేకతలు ఇవే..!

ఢిల్లీ : ప్రతిష్ఠాత్మక జీ-20 శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ వేదికగా నిలిచింది. ప్రగతి మైదాన్‌లోని ఐటీపీఓ కాంప్లెక్స్‌ను అధునాతన హంగులతో తీర్చిదిద్దారు. దాని ఎదుట దేశ పురాతన సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే నటరాజ విగ్రహం ఏర్పాటు చేశారు. ఇదే ఇప్పుడు అందరి దృష్టికి ఆకర్షిస్తోంది.

ప్రగతి మైదాన్‌లోని ఐటీపీఓ కాంప్లెక్స్‌ ఎదురుగా 27 అడుగుల ఎత్తైన నటరాజ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రతినిధులకు ఘనంగా ఆహ్వానించడంతో పాటు, భారతదేశ సంస్కృతి ప్రతిబింబించేలా నటరాజ విగ్రహాన్ని  నెలకొల్పారు.

విగ్రహ విశిష్టతను కొనియాడుతూ.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. జీ- 20 సదస్సుకు వేదికైన ప్రగతి మైదాన్‌ ముందు అద్భుతమైన నటరాజ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు మోదీ. ఇది భారత్‌కు ఉన్న గొప్ప చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంశాలకు మరింత జీవం పోస్తుందని చెప్పారు. శిఖరాగ్ర సమావేశానికి ప్రపంచమంతా భారత్‌కు తరలివస్తున్న వేళ.. మన దేశ కళాత్మకత, సంప్రదాయాలకు ఇది నిదర్శనం అని ప్రధాని ట్విట్టర్ లో చెప్పారు. 

విగ్రహ ప్రత్యేకతలు ఇవే.. 

* ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అష్ట ధాతు విగ్రహాలను తయారు చేసిన పద్ధతిలో నటరాజ విగ్రహం తయారు చేశారు. 

* వెండి, బంగారం, జింకు, రాగి, సీసం, తగరం, పాదరసం, ఇనుము పదార్థాల మిశ్రమంతో తయారైన విగ్రహాలను అష్ట ధాతు విగ్రహాలు అంటారు. ఇది 18 టన్నుల విగ్రహం. 

* 100 కంటే ఎక్కువ మంది కళాకారులు దీన్ని తయారు చేశారు. విగ్రహం తయారీకి దాదాపు రూ.10 నుంచి 12  కోట్ల వ్యయం అయ్యిందని  IGNCA సభ్య కార్యదర్శి సచ్చిదానంద్ జోషి తెలిపారు.

* చోళుల కాలం నాటి మైనపు కాస్టింగ్‌ (మధుచిష్ట్‌ విధాన్‌) అనే శిల్ప పద్ధతిని ఉపయోగించి దీనిని నిర్మించారు. అంటే ఎక్కడా కూడా అతుకులు లేకుండా విగ్రహాన్ని రూపొందించారు. 

* ఈ విగ్రహం భారత శక్తి చిహ్నం. దేశ సృజనాత్మకతకు నిదర్శం. ఇది జీ-20 సదస్సులో ఆకర్షణీయంగా నిలవనుంది అని ఇందిరా గాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్ట్స్‌ అధికారిక సైట్‌లో ప్రధాన శిల్పి రాధాకృష్ణ స్థపతి తెలిపారు. 

* తమిళనాడులోని స్వామి మలైకి చెందిన శిల్పి రాధాకృష్ణన్ స్థపతి, అతని శిశ్య బృందం ఏడు నెలల్లో ఈ విగ్రహాన్ని చెక్కారు. చోళ సామ్రాజ్యం కాలం నుండి 34 తరాల రాధాకృష్ణన్ వరకు ఇలాంటి విగ్రహాలను తయారు చేస్తున్నారని ఐజీఎన్‌సీఎ తెలిపింది. 

* అంతేకాదు.. రాధాకృష్ణ తండ్రి...శిల్పి దేవసేనాపతి స్థపతి ఢిల్లీలోని జనక్‌పురిలోని రాజరాజేశ్వరి ఆలయంతో సహా చోళుల కాంస్య శిల్పాలను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందారు.