
చిగురుమామిడి, వెలుగు: ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లిన కరీంనగర్ జిల్లాకు చెందిన యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామానికి చెందిన బూడిద కవిత, ఎల్లయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు చందు(22) ఇంటర్చదివాడు.
కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేక నాలుగు నెలల కింద ఉపాధి కోసం గల్ఫ్ కు వెళ్లి ఓ కంపెనీలో హెల్పర్ గా చేరాడు. మంగళవారం చందు కడుపునొప్పితో బాధపడుతుండగా తోటి కార్మికులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఖర్చు భరించే స్తోమత లేక కంపెనీ నిర్వాహకులతో మాట్లాడి మరో ఆస్పత్రికి తీసుకెళ్లి అడ్మిట్చేస్తుండగా గుండెపోటుతో అతడు మృతిచెందాడు.
ఏయీయూ తెలుగు హెల్పింగ్ఆర్గనైజేషన్కు సమాచారం అందించడంతో డెడ్ బాడీని సొంతూరికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. మృతుడికి ఇంకా పెండ్లి కాలేదు. చందు మృతి సమాచారంతో గ్రామంలో విషాదం నెలకొంది.