మిషన్ ​భగీరథ ఆఫీసర్ల నిర్లక్ష్యంతో చేయి కోల్పోయిన కాంట్రాక్ట్​ మెకానిక్

 మిషన్ ​భగీరథ ఆఫీసర్ల నిర్లక్ష్యంతో చేయి కోల్పోయిన కాంట్రాక్ట్​ మెకానిక్

భైంసా, వెలుగు : మిషన్​భగీరథ ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా నిర్మల్​ జిల్లా భైంసాలో ఓ యువకుడు చేయి కోల్పోయాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. టౌన్​లోని కిసాన్​గల్లీకి చెందిన ఎం.సాయినాథ్(21)​ కొన్ని నెలలుగా మిషన్ భగీరథ కాంట్రాక్ట్​ మెకానిక్​గా పని చేస్తున్నాడు. ఈ నెల 7న తానూర్​ మండలం హిప్నెలి తండాలోని సంపులో మోటార్ చెడిపోవడంతో రిపేర్ ​చేసేందుకు సాయినాథ్​ వెళ్లాడు. కేబుల్​జాయింట్​చేసి టేపు చుడుతున్న క్రమంలో ఒక్కసారిగా కరెంట్ సరఫరా జరిగి సాయినాథ్ షాక్ కు గురయ్యాడు. 

ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పక్కనే ఉన్న వ్యక్తి సాయినాథ్​ను కాపాడాడు. హుటాహుటిన భైంసాకు తరలించగా, పరీక్షించిన డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్​కు రిఫర్​చేశారు. వెంటనే అక్కడికి తరలించి ఓ ప్రైవేట్​హాస్పిటల్​లో చేర్పించగా, డాక్టర్లు సాయినాథ్ కుడి చేయిని తొలగించారు. మిషన్​భగీరథ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా కరెంట్​సరఫరాను పునరుద్ధరించడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

ALSO READ:కస్తూరిబా పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 100 మందికి అస్వస్థత

మిషన్ ​భగీరథ మండల సూపర్​వైజర్​తో పాటు ఉన్నతాధికారులు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సాయినాథ్ ది పేద కుటుంబం. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి గోదావరి అన్నీతానై చూసుకోగా, మెకానిక్​వృత్తి నేర్చుకున్న సాయినాథ్ కొంత కాలంగా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కరెంట్​షాక్​తో సాయినాథ్ చేయి కోల్పోవడంతో అతని కుటుంబం రోడ్డున పడింది. ఇప్పటికే ట్రీట్​మెంట్​ కోసం రూ.6 లక్షల వరకు చేశారు. మరికొన్ని ఆపరేషన్లు చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. మిషన్​భగీరథ అధికారులు తమకు న్యాయం చేయాలని యువకుడి తల్లి గోదావరి వేడుకుంటోంది.