ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుల్లో ఒకరైన అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన భార్య అనారోగ్య కారణంగా బెయిల్ కోసం అభిషేక్ బోయినపల్లి పిటిషన్ వేయగా.. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ లో చికిత్స చేయించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ట్రయల్ కోర్టు అనుమతితోనే అభిషేక్ బోయినపల్లి హైదరాబాద్ వెళ్లాలని ఆదేశించింది.
ట్రయిల్ కోర్టు బెయిల్ ఉత్తర్వులు మంజూరు చేసినప్పటినుంచి ఆదేశాలు అమలులోకి వస్తాయంది ధర్మాసనం. మిగిలిన బెయిల్ నిబంధనలను ట్రయిల్ కోర్టు తమ ఉత్తర్వుల్లో పేర్కొంటుందని వెల్లడించింది. తదుపరి విచారణ ఏప్రిల్29 కి వాయిదా వేసింది. అభిషేక్ బోయినపల్లి విదేశాలకు వెళ్ళడానికి వీలు లేదని.. పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈడీ అధికారులకు ఒక మొబైల్ నెంబర్ ఇవ్వాలని, సంబంధిత అధికారులకు తనకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇక ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ అధికారులో కస్టడిలో విచారణను ఎదుర్కోంటున్నారు.