ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్ టౌన్/సిద్దిపేటరూరల్​/చేర్యాల వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ గురువారం ఉమ్మడి మెదక్​ జిల్లాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనలు చేశారు. ర్యాలీలు నిర్వహించి సీఎం కేసీఆర్​ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు జీవన్, మెదక్ లో మెదక్​ ఏబీవీపీ విభాగ్ కన్వీనర్​ శ్రీనివాస్​గౌడ్, నర్సాపూర్లో జిల్లా కన్వీనర్​ శశికాంత్, చేర్యాలలో ఏబీవీపీ నగర కార్యదర్శి మంతపురి వినయ్ గౌడ్ మాట్లాడారు. పెండింగ్​లో ఉన్న ఫీజు రీయింబర్స్​మెంట్స్, స్కాలర్​షిప్​లు విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించాలని, యూనివర్సిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

రైతులకు ఇచ్చే స్థలాన్ని చదును చేయాలి;    మెదక్​ అడిషనల్​ కలెక్టర్ రమేశ్​

మెదక్​ (మనోహరాబాద్​), వెలుగు : మెదక్​ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు భూములు అప్పగించిన రైతులకు ఇచ్చే ఇళ్ల స్థలాలను చదును చేసి పంపిణీకి సిద్ధం చేయాలని మెదక్​ అడిషనల్​కలెక్టర్​ రమేశ్​అధికారులకు సూచించారు. గురువారం ముప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులోని టీఎస్ ఐఐసీ స్థలాన్ని ఆయన పరిశీలించారు. పరిశ్రమల ఏర్పాటు కోసం గతంలో సేకరించిన అసైన్డ్ భూముల నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు ఇస్తామన్న హామీ మేరకు 400 ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్టు చెప్పారు.  అనంతరం తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని అల్లాపూర్ శివారులో ఐదున్నర కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న గ్రేయిన్ మార్కెట్ యార్డు నిర్మాణ పనులను మార్కెటింగ్ ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ తో కలిసి పరిశీలించారు. నిర్మాణం చివరి దశకు వచ్చిన పనులను వేగవంతం చేసి ఈ నెలాఖరునాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యకమంలో తహసీల్దార్​ భిక్షపతి, మార్కెటింగ్ అధికారి రియాజ్ అహ్మద్, మార్కెటింగ్ శాఖ డీఈఈ మాధవ రెడ్డి, కాంట్రాక్టర్ పాల్గొన్నారు.

సిద్దిపేటలో పోలీస్ ఫిజికల్ టెస్టులు స్టార్ట్
తొలిరోజు 451 అభ్యర్థులు హాజరు.. 227 మంది ఉత్తీర్ణత

సిద్దిపేట/సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట జిల్లాలో పోలీస్ అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులు గురువారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు 582 అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 451 మంది హాజరయ్యారు. అందులో 227 మంది ఉత్తీర్ణత సాధించారు. టెస్టులను సీపీ ఎన్.శ్వేత జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొదటి రోజు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు. ఉదయం 5 గంటల నుంచే అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, బయోమెట్రిక్, రిస్ట్ బ్యాండ్, ఆర్ఎఫ్ఐడీ, 1600 మీటర్ల పరుగు పందెం నిర్వహించి, ఎత్తు కొలిచి అర్హత సాధించిన అభ్యర్థులకు లాంగ్ జంప్, షాట్ పుట్ ఈవెంట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఏఆర్ అడిషనల్ డీసీపీలు రామచంద్రరావు, సుభాష్ చంద్రబోస్, ట్రాఫిక్ ఏసీపీ ఫణిందర్, ఏసీపీ దేవారెడ్డి, సంగారెడ్డి ఏఆర్ డీఎస్పీ జనార్దన్, రిజర్వ్ ఇన్స్​పెక్టర్లు శ్రీధర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ధరణికుమార్, రామకృష్ణ, సీఐలు రవికుమార్, భానుప్రసాద్, జానకిరామ్ రెడ్డి, రామకృష్ణ, కమలాకర్, కృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్, సంజయ్, సురేందర్ పాల్గొన్నారు.

కోఆర్డినేషన్​తో పనిచేయాలి

నర్సాపూర్, వెలుగు : ప్రజా ప్రతినిధులు, ఆఫీసర్లు కోఆర్డినేషన్​తో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి సూచించారు. శుక్రవారం ఎంపీపీ జ్యోతి సురేశ్​నాయక్ అధ్యక్షతన నిర్వహించిన నర్సాపూర్ మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామపంచాయతీల కొత్త భవన నిర్మాణాలకు రూ.20 లక్షల చొప్పున, అంతర్గత సీసీ రోడ్లు, తండాలకు రోడ్లు వేయడానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఎంపీటీసీ ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ నర్సాపూర్ లో వంద పడకల ఆస్పత్రిని కొనసాగించాలని, రోడ్డు ప్రమాద నివారణకు పెద్ద చింతకుంట, చిన్నచింతకుంట, రెడ్డిపల్లి స్టేజీల వద్ద డివైడర్ తో కూడిన రోడ్డు వేయాలని కోరారు. ఈ పనులను త్వరలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎంపీడీఓ ఆఫీస్ స్థలంలోఎస్టిమేట్లు తయారు చేయాలని  సభ్యులు ఎమ్మెల్యే దృష్టికు వచ్చారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే రోడ్డు వైపు షాపింగ్​ కాంప్లెక్స్​ నిర్మించాలని  ఏఈ, డీఈని ఆదేశించారు. భారీ మొత్తంలో నియోజకవర్గానికి నిధులు రావడం పై హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచులు ఎమ్మెల్యేను పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్, జడ్పీటీసీ బాబ్యానాయక్, ఎంపీడీఓ మార్టిన్ లూథర్, ఆఫీసర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

రైతు వేదికలకు ఎప్పుడూ తాళాలేనా?

కోహెడ(హుస్నాబాద్), వెలుగు : లక్షల్లో ఖర్చు చేసి  రైతు వేదికలు నిర్మించి వాటికి ఎప్పుడూ తాళాలు వేయడమేంటని పలువురు సభ్యులు వ్యవసాయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హుస్నాబాద్​ఎంపీడీవో ఆఫీస్​లో ఎంపీపీ మానస అధ్యక్షతన జనరల్​బాడీ మీటింగ్ నిర్వహించారు. మండలంలో 12 వందలకు పైగా రైతులు ఈకేవైఎస్​ చేయించుకోలేదని, కనీసం రైతులకు అవగాహన కల్పించడం లేదని ఏవో నాగరాజును పందిల్ల సర్పంచ్​ రమేశ్​ నిదీశారు. రైతు వేదికల వైపు వ్యవసాయ అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదని అసహనం వ్యక్తం చేశారు. సమావేశానికి పలు శాఖల అధికారులు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విషయాన్ని కలెక్టర్ కు ఫిర్యాదు చేయాలని తీర్మానం చేశారు.

ట్రాక్టర్ ఈఎంఐ సర్పంచ్​ ఖాతా నుంచి కట్​ చేస్తారా? 
చిలప్​చెడ్​ జనరల్​ బాడీ మీటింగ్​లో సర్పంచుల ఆగ్రహం
 

మెదక్​ (చిలప్ చెడ్), వెలుగు: సామ్లా తండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్​కు సంబంధించిన ఈఎంఐ డబ్బులు సర్పంచ్​ అకౌంట్​ నుంచి కట్​ కావడంపై పలువురు సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఎంపీపీ వినోద దుర్గారెడ్డి అధ్యక్షతన చిలప్ చెడ్ మండల జనరల్​బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సామ్లా తండా సర్పంచ్ ​కోల భిక్షపతి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఇన్​స్టాల్​మెంట్​ డబ్బులు రూ.22 వేలు తన పర్సనల్​ అకౌంట్​ నుంచి కట్​ చేయడమేంటని ప్రశ్నించారు. ఆయా గ్రామాల సర్పంచులు లక్ష్మి, కవిత, అశోక్​ గౌడ్​, కోఆప్షన్​ మెంబర్​ షఫీ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి బిల్లులు పాస్​ కాకపోవడంతో సర్పంచుల అకౌంట్​ నుంచి డబ్బులు కట్​ అవుతున్నాయన్నారు. ఇక నుంచి ఇలా జరగకుండా చూడాలని ఎంపీడీఓ శశిప్రభ, ఎంపీఓ కృష్ణమోహన్​ ను కోరారు. ట్రాక్టర్​ ఇన్​స్టాల్​మెంట్​ డబ్బులు సర్పంచ్ అకౌంట్ నుంచి కట్​ అయిన విషయాన్ని డీపీఓ, అడిషనల్​ కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లినట్టు అధికారులు తెలిపారు. కౌడిపల్లి ఎస్​బీఐకి వెళ్లి విషయం తెలుసుకుంటామని చెప్పారు.